Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!

Cockroach Janata Party X

Cockroach Janata Party X

Cockroach Janta Party: ఇంట్లో ఒక్క బొద్దింక కనిపిస్తేనే ఆమడ దూరం పరుగెత్తేవాళ్లు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఇవి ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమై చిరాకు తెప్పిస్తుంటాయి. అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకునేది మీ వంటగదిలోనో, గోడల మీదో తిరిగే రెక్కల పురుగుల గురించి కాదు! ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ‘బొద్దింక’ దేశవ్యాప్తంగా పెను తుఫాను సృష్టించింది. భారతీయ యువతను ఏకం చేస్తూ, ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఆ పేరే ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP). అమెరికాలో ఉండే అభిజీత్ దిప్కే అనే వ్యక్తి స్థాపించిన ఈ వ్యంగ్య (Satirical), మీమ్ ఆధారిత ‘పార్టీ’ వెనకాల గురువారం నాడు ఒక రేంజ్ హై-డ్రామా నడిచింది. గురువారం ఉదయం కాక్‌రోచ్ జనతా పార్టీ సరికొత్త రికార్డుతో దూసుకుపోయింది. దేశంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న అధికార బీజేపీ (8.7 మిలియన్ ఫాలోవర్లు) ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను CJP దాటేసింది. అంతటితో ఆగకుండా, కొన్ని గంటల్లోనే 13.3 మిలియన్ల ఫాలోవర్లతో టాప్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా వెనక్కి నెట్టేసింది. మధ్యాహ్నానికి ఈ మీమ్ పార్టీ ఏకంగా 15 మిలియన్ల (1.5 కోట్లు) ఫాలోవర్లను సొంతం చేసుకుంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ స్థాయి ఫాలోయింగ్‌ను సాధించడం ఇంటర్నెట్ చరిత్రలోనే ఒక సంచలనం.

ఈ పార్టీ ఫాలోవర్ల సంఖ్య బీజేపీని దాటగానే, భారతదేశంలో CJP కి చెందిన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాను నిలిపివేశారు (Blocked). లీగల్ కారణాల వల్ల ఈ ఖాతాను నిలిపివేసినట్లు ‘ఎక్స్’ పేర్కొంది. దీనిపై దీని వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన వ్యక్తిగత ఖాతా నుంచి స్పందిస్తూ.. “మేం ముందే ఊహించినట్లుగానే, కాక్‌రోచ్ జనతా పార్టీ ఖాతాను ఇండియాలో బ్లాక్ చేశారు” అంటూ ఒక స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. బొద్దింకలను అంత సులభంగా చంపలేం కదా! సరిగ్గా అలాగే, ఖాతా బ్లాక్ అయిన కొన్ని గంటల్లోనే సరికొత్త అకౌంట్‌తో ఈ గ్రూప్ మళ్లీ ఎక్స్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. పైన పేర్కొన్న క్యాప్షన్‌తో పాటు, ఇన్‌స్టాగ్రామ్‌లో తమకు, బీజేపీకి ఉన్న ఫాలోవర్ల తేడాను చూపే స్క్రీన్‌షాట్‌ను పెట్టి.. “మమ్మల్ని బ్లాక్ చేయడానికి అసలు కారణం ఇదే” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ నివేదిక రాసే సమయానికి ఆ కొత్త అకౌంట్‌కు కూడా 53,000 మందికి పైగా ఫాలోవర్లు వచ్చేశారు. అంతేకాదు, “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి!” అంటూ ఒక మూడో పోస్ట్‌ను కూడా ఆ ఖాతాలో పెట్టారు.

ఈ క్రేజ్ చూస్తుంటే ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్‌లా మాత్రమే కనిపించడం లేదు. ఎందుకంటే ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ పేరుతో రెండు వేర్వేరు ట్రేడ్‌మార్క్ అప్లికేషన్లు సైతం దాఖలయ్యాయి. ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ పబ్లిక్ సెర్చ్ పోర్టల్ రికార్డుల ప్రకారం.. లీగల్, పర్సనల్ సర్వీసుల కిందికి వచ్చే ‘క్లాస్ 45’ కింద ఈ దరఖాస్తులు వచ్చాయి. అజీమ్ ఆదమ్‌భాయ్ జామ్ అనే వ్యక్తి ‘COCKROACH JANTA PARTY’ పేరుతో మొదటి అప్లికేషన్ పెట్టగా.. అఖండ్ స్వరూప్ అనే మరో వ్యక్తి ‘Cockroach Janta Party’ పేరుతో రెండో అప్లికేషన్ దాఖలు చేశారు.

అసలు ఈ బొద్దింకల ట్రెండ్ ఎలా మొదలైంది?
ఈ విచిత్రమైన ట్రెండ్ వెనుక దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విచారణ సందర్భంగా.. “దేశంలో నిరుద్యోగ యువత జర్నలిజం, సోషల్ మీడియా, ఆర్‌టీఐ (RTI) యాక్టివిజం వైపు మళ్లుతూ.. బొద్దింకలు, పరాన్నజీవుల (Parasites) లాగా మారుతున్నారు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని, యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఆ తర్వాత సీజేఐ స్పందిస్తూ.. తన వ్యాఖ్యలు నకిలీ డిగ్రీలతో ఈ రంగాల్లోకి వస్తున్న వారిని ఉద్దేశించినవి మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ ‘బొద్దింక’ అనే పదాన్నే యువత ఒక ఆయుధంగా మార్చుకుని, డిజిటల్ నిరసనగా ఈ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ని పుట్టించారు. అదిప్పుడు దేశంలోని అగ్ర రాజకీయ పార్టీలకే చెమటలు పట్టిస్తోంది!