తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎంసీహెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో జరిగిన ఈ సమావేశంలో సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, పర్యాటక శాఖ కార్యదర్శి వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై పలు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం.. తారామతి బారాదరిని మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంకా మంజీరా, దిల్కుషా గెస్ట్ హౌస్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలని సూచించారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, అక్కడి వీరభద్రస్వామి దేవాలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అటవీ శాఖ పరిధిలోని భూములను పర్యాటక శాఖతో సమన్వయం చేసుకుని ఎకో టూరిజం ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో మరిన్ని ఎకో పార్కులను ఏర్పాటు చేయాలని, ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూములను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అర్బన్ ఫారెస్ట్ నమూనాలో ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టి, వాటి అమలును వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు.
మరోవైపు హైదరాబాద్ నగర చారిత్రక వారసత్వాన్ని పర్యాటక రంగానికి అనుసంధానం చేసే దిశగా పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జ్ను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. ఈ వంతెనపై పర్యాటకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, అవసరమైతే ట్రాఫిక్ను మళ్లించి పర్యాటక కార్యకలాపాలకు అవకాశం కల్పించాలని అధికారులకు తెలిపారు. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సమ్మిట్ విజయవంతం కోసం వివిధ శాఖల మధ్య సమన్వయం కల్పించేలా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణను వేగవంతం చేయాలని సూచించారు.

