CM Revanth Reddy: సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణ మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికలు, కార్యాచరణపై చర్చించారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి, ఆగస్టు నెల చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఐదేండ్ల క్రితం ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.
Read Also: Deputy CM Bhatti Vikramarka: ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎల్ఆర్ఎస్.. డిప్యూటీ సీఎం ఆదేశాలు
ఈ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లనే కొనసాగించాలని, ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం వారం రోజుల క్రితం ఆదేశించిన సంగతి తెలిసిందే.