కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీల పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ నగర శాంతిభద్రతల పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీలను పునరుద్దరించాలని, బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి.. క్రిమినల్స్ తో కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రంకన్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలని, హైదరాబాద్ నగరంలో రాత్రి పూట ఫుడ్ కోర్ట్ ల విషయంలో ఇబ్బంది రానివ్వొద్దన్నారు. డ్రగ్స్ నియంత్రణ పైన పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలని, డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని, ఎవరో చెబితే కలెక్టర్లు,ఎస్పీలకు పోస్టింగ్ లు ఇవ్వలేదు…సమర్థత ఆధారంగా నిర్ణయం తీసుకున్నారని, కలెక్టర్లు తప్పని సరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనన్నారు సీఎం రేవంత్. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించాలని, రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు. రుణమాఫీ అమలు పైన కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి.