CM Revanth Reddy Launches Telangana Public School: తెలంగాణ విద్యావ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా.. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (Telangana Public School) ప్రారంభమైంది. ఆరుట్ల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సరికొత్త విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు.
స్కూల్ బస్సులో సీఎం ప్రయాణం:
ఆరుట్లకు చేరుకున్న సీఎం, అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కూల్ బస్సులో ప్రయాణించి పాఠశాల ప్రాంగణానికి చేరుకున్నారు.
ప్రభుత్వ బడులకు పూర్వవైభవం:
ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు పలు చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తూ, వారికి ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఏడాదికి రెండు జతల యూనిఫాం దుస్తులను ప్రభుత్వం అందిస్తోంది. దీంతో పేద కుటుంబాలకు విద్యా ఖర్చుల భారం తగ్గుతోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోంది. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన పోషకాలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. నేడు సీఎం రేవంత్ పిల్లలితో కలిసి అల్పాహారం చేశారు.

