తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ, ఉస్మానియా రెండూ అవిభక్త కవలల్లాంటివి.. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఇది.. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులే.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి ఈ యూనివర్సిటీ విద్యార్థినే.. తెలంగాణ నలుమూలలా ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది యూనివర్సిటీలోనే.. చదువుతోపాటు పోరాటాన్ని నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ.. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది ఉస్మానియా యూనివర్సిటీ..
Also Read:District Collector P Prasanthi: ఆకస్మిక తనిఖీలు.. ఎరువుల పంపిణీపై కలెక్టర్ హెచ్చరిక
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారిది ఉస్మానియా యూనివర్సిటీనే.. యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి రాష్ట్ర సాధనలో సమిధలయ్యారు.. ఎంతో మంది మేధావులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీది.. గత పదేళ్ల పాలనలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరిగింది.. ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని మేం ఆలోచన చేశాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించాం.. చదువుకుని చైతన్యం ఉన్న వారిని వీసీలుగా నియమించాం.. తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచే మేధా సంపత్తిని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆశిస్తున్నాం..
దేశానికి యువ నాయకత్వం అవసరం.. దేశంలో 60 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారే.. ఇది మన దేశ సంపద.. 21 ఏళ్ల వయసులో IAS లు దేశానికి సేవలందిస్తున్నప్పుడు.. 21 ఏళ్ల యువకులు శాసన సభలో ఎందుకు అడుగుపెట్టకూడదు?.. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆవేదన కలుగుతోంది.. యువతను గంజాయి, డ్రగ్స్ వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయి.. గంజాయి, డ్రగ్స్ యువతను నిర్వీర్యం చేస్తున్నాయి.. ఆ వ్యసనాల నుంచి యువతను బయటపడేలా చేయాలి.. చదువు, చైతన్యం ఉంటేనే సమాజంలో రాణిస్తారు.. నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే..
మీ తలరాతలు మార్చేది చదువొక్కటే.. చదువు ఒక్కటే మిమ్మల్ని ధనవంతుల్ని చేస్తుంది, గుణవంతులను చేస్తుంది.. పేదరికం మాకు కొత్త కాదు.. ఆ పేదరికాన్ని చూసి వచ్చినవాళ్ళం.. పేదరికాన్ని పారద్రోలడం మాకంటే ఎక్కువ ఎవరికీ తెలియదు.. యూనివర్సిటీ అభివృద్ధి అధ్యయనానికి ఇంజనీర్స్ కమిటీ వేయాలని అధికారులను ఆదేశిస్తున్నా.. ఉస్మానియా యూనివర్సిటీని స్టాన్ ఫర్డ్, ఆక్స్ ఫర్డ్ స్థాయిలో తీర్చిదిద్దుతాం.. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలవాలి.. ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు.. యూనివర్సిటీ అభివృద్ధికి ఏం కావాలో అడగండి.. అంచనాలు తయారు చేసి ఇవ్వండి..
మళ్లీ యూనివర్సిటీకి వస్తా.. ఆర్ట్స్ కాలేజీ వద్ద మీటింగ్ పెట్టి నిధులు మంజూరు చేస్తా.. పోలీసులకు నేను ఆదేశిస్తున్నా.. ఆ రోజు ఒక్క యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కనిపించొద్దు.. నిరసన తెలిపే వారిని నిరసన తెలపనివ్వండి.. నేను రావొద్దని అడ్డుకునే వారికి సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది.. కొంతమంది రాజకీయ నాయకులకు పదవులు పోయాయన్న ఆవేదన ఉంటుంది.. వాళ్ల కొడుకులను ఏదో చేద్దామనుకుంటే ఏదో అవుతున్నారని బాధ ఉంటది.. వారి ఉచ్చులో మీరు పడొద్దు.. సమస్య ఉంటే మాకు చెప్పండి.. మా మంత్రులు మీకు అందుబాటులో ఉంటారు.. కోదండరామ్ సార్ పై కుట్ర చేసి సుప్రీం కోర్టుకు వెళ్లి పదవి తొలగించారు.. ఇదేం పైశాచిక ఆనందం.. మళ్లీ కోదండరాం సార్ కు ఎమ్మెల్సీ ఇస్తాం..
Also Read:Bigg Boss : గుండు గీయించుకోవడం.. పేడ రాసుకోవడం.. ఏంటీ పిచ్చి టాస్కులు..
అపోహలకు లోను కాకండి.. అబద్ధాల సంఘం చెప్పే మాటలు నమ్మొద్దు..వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నాయని ప్రచారం చేసి అడ్డుకున్నారు.. తెలంగాణలో సింహాలు, ఏనుగులు లేనేలేవు.. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి.. వాళ్లు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు లాంటివారు.. వాళ్లు తెలంగాణ సమాజం బాగు కోరుకోరు.. వాళ్లు మళ్లీ వస్తే ఉస్మానియా యూనివర్సిటీని ఉండనివ్వరు.. మీ చదువుకు ఏం కావాలో అడగండి.. ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని సీఎం రేవంత్ తెలిపారు.
