CM Revanth Reddy : రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎండలు పెరిగిన కొద్దీ తలెత్తే గడ్డు పరిస్థితులను ముందస్తు అంచనా వేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదల శాఖ ఉన్నత అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని, వాటికి అనుగుణంగా పరిష్కార మార్గాలు అనుసరించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా, పంటలు ఎండిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు సాగు నీటి విడుదలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీతో పాటు ప్రధాన ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, నీటి వినియోగం వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని, సాగు నీటికి తాగునీటికి ఎక్కడా ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.
Indian Railways: ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఎఫెక్ట్.. రైల్వే కీలక నిర్ణయం
రాబోయే మూడు నెలలు అత్యంత కీలకమని, రాష్ట్రమంతటా అన్ని ప్రాంతాల్లో సాగు తాగు నీరు. విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని సీఎం అన్నారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా తాగు నీరు, సాగునీటిని అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ చూపాలని సీఎం ఆదేశించారు. వెంటనే సంబంధిత అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని జిల్లాల వారిగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని చెప్పారు.
నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలు, నీటి విడుదల పై ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత ఇరిగేషన్ ఇంజనీర్ల తో వెంటనే సమీక్ష లు నిర్వహించాలని ఆదేశించారు. ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల తీరును కలెక్టర్ల స్వయంగా పరిశీలించాలని సూచించారు. నిర్ణీత ఎజెండాను ఖరారు చేసుకొని అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తగిన ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణజలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత కోటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమని సీఎం స్పష్టం చేశారు. టెలీమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావటం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు.
టెలీ మెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులన్నీ ముందుగా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని, వెంటనే టెలీమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వెంటనే కేఆర్ఎంబీకి లేఖ రాయాలని సీఎం ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ఆదేశించారు. నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జల సంఘంపైనే ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Ajay Singh Yadav : కులగణన సిటీ స్కాన్ లాంటిది.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది