CM Revanth: నేడు రవీంద్రభారతిలో జరిగిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టుల పోరాటాలపై తనకు అభిమానం ఉందని తెలిపారు. రైతు, కూలీల కోసం కమ్యూనిస్టులు పోరాటం చేశారని, ఆ సమస్యలకు పరిష్కారం చూపింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇంకా.. దున్నే వాడికి భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని సీఎం పేర్కొన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్కే దక్కుతుందని అన్నారు. “పోరాటం కమ్యూనిస్టులది.. పరిష్కారం కాంగ్రెస్ పార్టీది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మరోవైపు బీజేపీపై విమర్శలు చేస్తూ.. ప్రజలతో గెలవలేనప్పుడు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించిందని ఆరోపించారు. ఇప్పుడు ఎస్ఐఆర్ (SIR)ను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మైనార్టీల ఓట్లే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓట్లను కూడా తొలగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓట్ల తొలగింపును అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రతిపక్షాలు ఇప్పటివరకు ఈ అంశంపై మాట్లాడటం లేదని అన్నారు.
2029 ఎన్నికల్లో మోదీ ఓటమికి ఇవే తొలి అడుగులు అని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అని ఆలోచించవద్దని.. 2026లోనే ఎవరు గెలవాలి.? ఎవరు ఓడిపోవాలి.? అనే విషయాన్ని బీజేపీ నిర్ణయించే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం నిర్ణయించాల్సిన అంశాల్లో కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వందేళ్ల కమ్యూనిస్టు చరిత్రను తిరగేస్తే ఎర్రజెండా అంటే ప్రజలకు నమ్మకం, పేదలకు భరోసా అని రేవంత్ రెడ్డి అన్నారు. మిగిలిన జెండాలను ప్రజలు పాలకుల జెండాలుగా భావిస్తారని, ఎర్రజెండా కనిపిస్తే మాత్రం భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.
కమ్యూనిస్టులు ఎన్నికల్లో గెలుస్తారా? ఓడిపోతారా? అనే లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. ప్రజల ఓట్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కమ్యూనిస్టులు లేవనెత్తే సమస్యలకు సహేతుకమైన పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పాలమూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ప్రస్తావించిన సీఎం.. సమస్యను లేవనెత్తేవారు పాలమూరు వారేనని, పరిష్కారం చేసేవారు కూడా పాలమూరు వారేనని అన్నారు. సారంపల్లి మల్లారెడ్డి పేరుకు తగిన గౌరవం దక్కేలా ఏదో ఒక ప్రాంతానికి ఆయన పేరు పెట్టే అంశంపై మంత్రివర్గంలో చర్చిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.

