ఢిల్లీ పర్యటనలో రెండు రోజులుగా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరిపారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే దొడ్డుబియ్యం కొనుగోలుపై కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. దొడ్డు బియ్యం కొనుగోలు అసాధ్యమని, ఇప్పటికే నిల్వలు ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఈసారికి కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కోరినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కలిశారు. సుమారు అరగంట పాటు భేటీ కొనసాగింది.అంతకుముందు కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశమయ్యారు.
సుమారు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్నగర్ జిల్లాకు జరుగుతున్న నష్టం, కృష్ణా జలాల అంశంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై చర్చించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, నీటి కేటాయింపులు జరపాలని కేంద్ర మంత్రిని కోరారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ అమలు తేదీ వాయిదాను మరోసారి షెకావత్ వద్ద ప్రస్తావించారు.
ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా ఉన్న ప్రాజెక్టులనే నోటిఫికేషన్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం కోరారు.. మరోవైపు వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం అనంతరం కొందరు ముఖ్యమంత్రులతో హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్తో అమిత్ షా లంచ్ మీటింగ్ లో పాల్గొన్నారు. నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి భోజనం చేసిన అమిత్ షా నక్సల్స్ సమస్యపై వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.
