CM Convey: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..

Chandrababu Ugadi Speech

Chandrababu Ugadi Speech

ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ‘పొదుపు’ పిలుపునిచ్చారు. ప్రధాని సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ, తన సొంత కాన్వాయ్‌ నుంచే పొదుపు చర్యలను ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తన భద్రతా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా జిల్లా పర్యటనల సమయంలో ఉండే భారీ కాన్వాయ్‌లను 50 శాతం మేర కుదించాలని డీజీపీ మరియు ఇంటెలిజెన్స్ చీఫ్‌తో జరిగిన భేటీలో ఆయన పేర్కొన్నారు. కేవలం భద్రతా ప్రోటోకాల్‌కు అవసరమైన వాహనాలను మాత్రమే ఉంచి, మిగిలిన వాటిని తొలగించాలని సూచించారు. దీనివల్ల ఇంధన ఆదాతో పాటు, సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మంత్రులు, వీఐపీలకు సూచనలు..
ఈ పొదుపు చర్యలు తనకే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని మంత్రులు, ఇతర వీఐపీలు కూడా సాధ్యమైనంత తక్కువ వాహనాలను వినియోగించాలని చంద్రబాబు కోరారు. అనవసరపు ఆడంబరాలకు పోకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని, అది దేశ భక్తికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ సూచనలతో ఇప్పటికే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ కాన్వాయ్‌లను కుదించుకోవాలని నిర్ణయించారు. వారి బాటలోనే పయనిస్తూ చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం ఏపీలో కొత్త ఒరవడికి నాంది పలికింది. రేపటి క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఖర్చులను మరింత తగ్గించేలా, ఇతర పొదుపు మార్గాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సామాన్య ప్రజల పక్షాన ఉంటూ, దేశ ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా తన సౌకర్యాలను తగ్గించుకుంటున్న చంద్రబాబు తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.