CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..

Cm Chandrababu

Cm Chandrababu

రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టబోతున్న రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (RSK) ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు అత్యంత పారదర్శకంగా, వేగంగా రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాలను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ‘కొందరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం ప్రైవేటీకరణ కాదు’ అని సీఎం తేల్చి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల (PSK) విధానం వల్ల పాస్‌పోర్ట్ ప్రాసెసింగ్ ఎంత సులభతరమైందో, అదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయని వివరించారు. ఈ విధానం ద్వారా ప్రజలకు మధ్యవర్తుల ప్రమేయం, వేధింపులు లేకుండా నేరుగా సేవలు అందుతాయని భరోసా ఇచ్చారు. కొత్త విధానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల సామాన్య ప్రజలకు కలిగే లాభాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా వివరించాలని కోరారు.

ఈ మార్పుల వల్ల ఉపాధి కోల్పోతామని ఆందోళన చెందుతున్న డాక్యుమెంట్ రైటర్లకు సీఎం చంద్రబాబు పెద్ద ఉపశమనం కలిగించారు. “డాక్యుమెంట్ రైటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి ఉపాధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రత్యామ్నాయంగా మెరుగైన ఆదాయ మార్గాలు చూపే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది” అని సీఎం హామీ ఇచ్చారు. సాంకేతికతను జోడించి వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని ఆయన పునరుద్ఘాటించారు.