ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ మేఘాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పొదుపు ఒక్కటే మార్గమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడం, అనవసర ఖర్చులను అరికట్టడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చన్న ప్రధాని నరేంద్ర మోడీ సూచనలను ఆయన బలపరిచారు. ఈ క్రమంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానాన్ని మళ్ళీ తెరపైకి తెస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్తో ప్రయోజనాలు..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడం వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాకుండా, రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఆయన విశ్లేషించారు. లక్షలాది మంది వాహనాలపై రోడ్ల మీదకు రాకుండా ఇంటి నుంచే పనిచేస్తే.. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గి, దేశం నుంచి తరలిపోయే విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది.
కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా, ప్రభుత్వంలోని కొన్ని శాఖల్లో కూడా పరిస్థితులకు అనుగుణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, దీనివల్ల దేశంపై ఆర్థిక భారం పడుతుందని బాబు ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను ప్రజలు ఓపికతో భరించాలని కోరారు. దేశం మొత్తం దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని, పొదుపును ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
గతంలో కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, కుటుంబాలతో గడిపే సమయం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు అదే పంథాలో ఆలోచిస్తూ.. డిజిటల్ గవర్నెన్స్, ఆన్లైన్ సేవలను మరింత బలోపేతం చేయడం ద్వారా కార్యాలయాలకు ప్రజలు వచ్చే అవసరం లేకుండా చేయాలని భావిస్తున్నారు. ఇది అంతిమంగా పరిపాలనలో వేగాన్ని, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకువస్తుందని ఆయన నమ్మకం. ప్రజలు, మేధావులు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని దేశ హితం కోసం సహకరించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
