ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి రికార్డుల నిర్వహణలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది రైతులకు భరోసా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా కొత్తబురుజు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న సీఎం.. రైతులకు క్యూఆర్ (QR) కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు ప్రయోజనాల దృష్ట్యా వివాదాస్పద ‘ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని’ రద్దు చేసినట్లు గుర్తు చేశారు.
Also Read:TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. భూ యజమానుల హక్కులకు భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. భూ రికార్డులను తారుమారు చేసే అవకాశం లేకుండా పక్కాగా పట్టాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో పాసుపుస్తకాల విషయంలో నెలకొన్న గందరగోళానికి స్వస్తి పలుకుతూ.. కొత్త టెక్నాలజీతో కూడిన క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీనివల్ల రికార్డుల భద్రత పెరగడమే కాకుండా.. ఫోర్జరీకి అవకాశం ఉండదని తెలిపారు.
Also Read:VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..
ఒక్క పైసా కూడా అవినీతికి తావులేకుండా పట్టాలు అందజేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూ వివాదాలు , రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరించిన తర్వాతే కొత్త పాసుపుస్తకాలను జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రికార్డుల నిర్వహణలో జరిగిన తప్పుల వల్ల రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చంద్రబాబు విమర్శించారు. భవిష్యత్తులో అటువంటి పొరపాట్లు జరగకుండా.. రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
