CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ అడుగు వేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సుమారు రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ‘ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్’ ప్లాంట్కు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “ఉత్తరాంధ్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఇకపై ఉత్తరాంధ్ర అంటే కేవలం వెనుకబడిన ప్రాంతం కాదు.. అది ‘ఉక్కు ఆంధ్ర’గా పిలవబడుతుంది” అని రాసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు.
READ ALSO: Vijawada : పట్టుబడిన ముగ్గురు యువకులకు ఉగ్రవాదులతో లింక్.. వెలుగులోకి కీలక విషయాలు..!
స్టీల్ సిటీగా నక్కపల్లి
ఆర్సెలార్ మిట్టల్ ప్లాంట్ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, ఇది ఈ ప్రాంతాన్ని ఒక పూర్తి స్థాయి ‘స్టీల్ సిటీ’గా మారుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్కు రంగంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యున్నత స్థానానికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రూ.1.36 లక్షల కోట్ల వ్యయంతో ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్గా ఇది అవతరించనుంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1 లక్ష మందికి పైగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. రెండు దశల్లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2028 డిసెంబర్ నాటికి మొదటి దశ ఉత్పత్తి ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందించిన పూర్తి సహకారం వల్లే ఇంతటి భారీ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురాగలిగామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
READ ALSO: Indian Spy Movies: సరిహద్దులు దాటిన ఇండియన్ సినిమా క్రేజ్.. పాక్లో మన సినిమాలదే హవా!