CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంపై పారిశ్రామికవేత్తలకు ఉన్న విశ్వాసం దెబ్బతిన్నప్పటికీ, తమ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని చెప్పారు. వ్యవసాయాధారిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామికంగానూ అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
మంత్లీ ఎకనామిక్ రిపోర్ట్ సమీక్ష సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. దేశంలోనే తొలిసారిగా నెలవారీ ఆర్థిక నివేదిక ద్వారా రాష్ట్ర వృద్ధిని సమీక్షిస్తున్నామని తెలిపారు. జీఎస్డీపీతో పాటు రెవెన్యూ రిసిప్ట్స్ను ఎప్పటికప్పుడు అంచనా వేసే విధంగా ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్ ద్వారా పాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగులు, అధికారుల నెలవారీ పనితీరును కూడా నిరంతరం సమీక్షిస్తామని స్పష్టం చేశారు.
ఫిర్యాదులపై సీఎం ఆందోళన
కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రజల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (PGRS) ద్వారా వాటిని వేగంగా పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పనిగట్టుకుని చేసే తప్పుడు ఫిర్యాదులను కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో గత పాలన కారణంగా పెద్దఎత్తున సమస్యలు పేరుకుపోయాయని, వాటిని పరిష్కరించేందుకు ప్రతి నెలా జిల్లాల్లో పర్యటిస్తూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంకా 72 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉందని వెల్లడించారు.
పెరిగిన రెవెన్యూ వసూళ్లు..
రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లు 24 శాతం పెరిగాయని, 2017తో పోలిస్తే గత ఏడాది 20 శాతం వృద్ధి నమోదైందని సీఎం పేర్కొన్నారు. లక్ష్యంగా పెట్టుకున్న 15 శాతం వృద్ధి రేటును సాధించడం అసాధ్యం కాదని, అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాలనను సులభతరం చేయడానికి, రెవెన్యూ పెంపునకు ఏఐ ఆధారిత టూల్స్ను కూడా అభివృద్ధి చేశామని తెలిపారు.
కీలక స్థానాల్లో ఉండి ప్రతికూల ధోరణా..?
కొంతమంది కీలక స్థానాల్లో ఉండి ప్రతికూల ధోరణితో వ్యవహరిస్తున్నారని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఉన్నతాధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. “Good Officer Solves Problems – Great Officer Prevents Them” అనే భావనతో అధికారులు ముందుచూపుతో పనిచేయాలని అన్నారు. ఇక, విద్యుత్ రంగంపై మాట్లాడిన సీఎం, తమ ప్రభుత్వం మూడో ఏడాదిలోకి అడుగుపెట్టినా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తుచేశారు. ఐదేళ్ల పాటు ఛార్జీలు పెంచబోమన్న హామీని నిలబెట్టుకున్నామని, ట్రూ డౌన్ అమలు ద్వారా వినియోగదారులపై భారం తగ్గించామని చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను అన్వేషిస్తున్నామని, ఇండక్షన్ స్టవ్లు, సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించాలని సూచించారు.
పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం ఎప్పుడంటే..?
సాగునీటి ప్రాజెక్టులపై కూడా సీఎం కీలక ప్రకటనలు చేశారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను విడుదల చేస్తామని, సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను కూడా జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని, పట్టిసీమ ప్రాజెక్టు వల్ల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు అందించగలుగుతున్నామని వివరించారు. అలాగే జల్ జీవన్ మిషన్ సహా అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. చివరగా రాష్ట్రం జీఎస్డీపీలో 10.75 శాతం వృద్ధిని నమోదు చేసిందని, 15 శాతం వృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి శాఖ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

