Superstar Rajinikanth: నిజాయితీకి రోజులు లేవని అనే వారికి ఈ ఘటన ఒక మంచి ఉదాహరణ. నిజానికి మీలో ఎవరికైనా 45 తులాల బంగారు గొలుసు రోడ్డుపై దొరికితే ఏం చేస్తారు.. ఎవరు మనల్ని చూడటం లేదుగా అని చూసి, ఆ గొలుసును తీసుకొని జేబులో వేసుకుంటామా లేదా. కానీ ఈవిడ మాత్రం అలా చేయలేదు. తనకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన తన నిజాయతీని చాటుకుంది ఒక పారిశుద్ధ్య కార్మికురాలు. నిజాయితీకి ఉండే పవర్ ఎలాంటిది అంటే.. ఈ విషయం సూపర్ స్టార్ రజనీకాంత్ దృష్టికి వెళ్లింది. అసలు ఏం జరిగిందంటే..
చెన్నై మహానగర పాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ (50) అనే మహిళకు ఇటీవల రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారం దొరికింది. వాస్తవానికి ఆమె తనకు దొరికిన ఆ బంగారంపై ఎలాంటి ఆశపడలేదు. నిజాయితీగా తనకు దొరికిన ఆ 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించింది. ఈ క్రమంలో పలువురు స్థానికులు ఆమెను అభినందించారు. తాజాగా విషయం తెలుసుకొని సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఇంటికి పిలిచి ఆమెతో ఆప్యాయంగా మాట్లాడి, ఆమెను సన్మానించారు. అనంతరం ఆమెకు సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక బంగారపు గొలుసును గిఫ్ట్గా ఇచ్చారు. అలాగే భారత తపాలా శాఖ కూడా పద్మ నిజాయితీకి మెచ్చి అరుదైన గౌరవాన్ని అందించింది. ఇటీవల ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును భారత తపాలా శాఖ రిలీజ్ విడుదల చేసింది. దీంతో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా ఇచ్చారు. అలాగే ఆమెను అభినందిస్తూ ప్రభుత్వం తరఫున రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో అందించారు.
ఈ విషయం తెలుసుకున్న లలిత జువెలరీ అధినేత డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ కూడా పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను వారింటికి పిలిపించి ఘనంగా సత్కరించారు. ఆమెకు శాలువా కప్పి సత్కరించడమే కాకుండా, ఒక వెండి పళ్ళాన్ని కానుకగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “లక్షల విలువైన బంగారం దొరికినప్పుడు మనసు చలించకుండా ఉండటం సామాన్యమైన విషయం కాదు. పద్మ వంటి వారు సమాజానికి ఆదర్శప్రాయులు” అని కొనియాడారు.
READ ALSO: Maharashtra: మంత్రి పంకజ ముండేకు తప్పిన హెలికాప్టర్ ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా..!