Anakapalle Land Pooling: అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాలు.. దూకుడు పెంచిన సీఐడీ !

  • అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాలపై సీఐడీ దూకుడు
  • రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రశ్నించనున్న సీఐడీ
  • తహసీల్దార్ కార్యాలయం నుంచి డాక్యుమెంట్లు స్వాధీనం
Anakapalle Land Pooling Cid

Anakapalle Land Pooling Cid

అనకాపల్లి ల్యాండ్ పూలింగ్ అక్రమాల కేసులో సీఐడీ దూకుడు పెంచింది. ఇంటి స్థలాల కోసం గత ప్రభుత్వ హయాంలో డి-ఫారం పట్టా, ఆక్రమిత భూములను సమీకరణపై వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రశ్నించనుంది. ఇప్పటికే అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం నుంచి ముఖ్య డాక్యుమెంట్లు, రికార్డులను సీఐడీ స్వాధీనం చేసుకుంది.

మాజీ మంత్రి గుడివాడ అమర్నాద్ ఎమ్మెల్యేగా వున్న సమయంలో జరిగిన భూసమీకరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్ ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఐడీ విచారణకు ఆదేశించింది. భూ సమీకరణలో కీలకమైన అప్పటి వీఆర్వోలు, తహసీల్దార్ల నుంచి సీఐడీ అధికారులు ఇప్పటికే వివరాలు సేకరించారు. కొనసాగింపుగా రెవెన్యూ సిబ్బందిని విచారించేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. అనకాపల్లి మండలంలోని 11 గ్రామాలలో 1,050 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వ హయాంలో సమీకరించారు. అయితే ల్యాండ్ పూలింగ్‌కు ముందే వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, డీఫారం పట్టా భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి ఎక్కువ లబ్ధి పొందారనేది కంప్లయింట్ ఉంది.

Also Read: CM Chandrababu: కుప్పంలో మహిళపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం!

ప్రాధాన్యం లేని చోట స్థలాలు ఇచ్చారంటూ కోడూరు, గొలగాం, కుంచంగి, వేటజంగాలపాలెం గ్రామాల్లోని జనాలు తమ పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదు. 2020 నుంచి 2023 మధ్య జరిగిన ఈ భూసమీకరణ అక్రమాలపై విచారణ జరపాలని అప్పుడే స్థానిక టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తాజాగా ఈ వ్యవహారంపై విచారణ ప్రక్రియను సీఐడీ వేగవంతం చేసింది.