NTV Telugu Site icon

Chang’e 6: చైనా మరో ఘనత.. భూమి మీదకు జాబిల్లి ఆవలి వైపు నమూనాలు

Change 6

Change 6

చంద్రమండల యాత్రల్లో చైనా మరో ఘనత సాధించింది. ప్రపంచ చరిత్రలో తొలిసారి జాబిల్లికి ఆవలి వైపు నమూనాలు సేకరించి.. వాటిని విజయవంతంగా భూమి మీదకు తీసుకొచ్చింది. చంద్రుడి రెండో వైపు నుంచి మట్టి, శిథిలాలను మోసుకుని చాంగే-6 వ్యోమనౌక భూమిని చేరుకుంది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతాల్లో ఇది సురక్షితంగా ల్యాండ్ అయింది. మే 3వ తేదీన చాంగే-6 నింగికెగిరి దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి జాబిల్లిని చేరింది. జూన్ 2న చంద్రుడి ఆవలి వైపున సౌత్‌ పోల్‌-అయిట్కిన్‌ ప్రాంతంలో ఉన్న అపోలో బేసిన్‌లో సురక్షితంగా దిగింది. ఈ మిషన్ లో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రిటర్నర్ అనే నాలుగు భాగాలు ఉన్నాయి. జాబిల్లి ఉపరితలంపై ఉన్న నమూనాలను రోబోటిక్‌ హస్తం సాయంతో సేకరించింది. డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి దిగువన ఉన్న ప్రాంతం నుంచి మట్టిని తీసుకుంది. అనంతరం వాటిని తీసుకుని భూమికి తీసుకొచ్చింది. చాంగే-6 వ్యోమనౌక తీసుకొచ్చిన నమూనాలను 2.5 మిలియన్ ఏళ్ల పురాతన అగ్ని పర్వత శిలలు కూడా ఉండొచ్చని చైనా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Read Also: Nokia 3210: భారత మార్కెట్‌లోకి ‘నోకియా 3210’ ఫోన్.. యూపీఐ, యూట్యూబ్‌ ఫీచర్స్ కూడా!

ఈ నమూనాలను అధ్యయనం చేస్తే.. చంద్రుడికి రెండు వైపులా ఉన్న భౌగోళిక వ్యత్యాసాలకు సంబంధించి పలు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని విశ్వసంగా ఉన్నారు. చందమామకు సంబంధించిన ఒక భాగం మాత్రమే భూమి నుంచి కనిపిస్తోంది. ఇవతలి భాగం నియర్ సైడ్ గా పేర్కొంటారు. రెండో భాగం ఫార్‌ సైడ్‌గా పిలుస్తారు. ఇప్పటి వరకూ అమెరికా, సోవియట్ యూనియన్ తో పాటు చైనా కూడా పలుమార్లు నియర్ సైడ్ నుంచి నమూనాలు సేకరించి భూమికి తీసుకొచ్చింది. అవతలి భాగం నుంచి మట్టి, శిథిలాలను తీసుకురావడం ఇదే తొలిసారి. చంద్రుడి రెండు ప్రాంతాలు పూర్తిగా వేరుగా ఉంటాయని రిమోట్ సెన్సింగ్ పరిశోధనల్లో వెల్లడైంది. ఇవతలి భాగం ఒకింత చదునుగా ఉంటుంది. అవతలి ప్రాంతమంతా అంతరిక్ష శిలలు ఢీకొట్టడం వల్ల భారీ బిలాలు ఏర్పడ్డాయి. చంద్రుడి ఉపరితల మందం కూడా రెండు భాగాల్లో వేరుగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది.

Read Also: South Central Railway : భారీగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైళ్లు