Site icon NTV Telugu

China: మరణశిక్షల్లో చైనా నయా రికార్డ్.. 30 రోజులు – 15 ఉరిశిక్షలు!

China

China

China: చైనా మరణశిక్షల అమలులో నయా రికార్డ్‌ను సృష్టించింది. ఈ రికార్డ్‌తో డ్రాగన్ దేశం సౌదీ అరేబియా, ఇరాన్‌లను అధిగమించింది. 2026 మొదటి నెలలో చైనా 15 మందికి మరణశిక్ష విధించింది. ఇదే టైంలో సౌదీ అరేబియా ఒక వ్యక్తిని ఉరితీసింది, ఇరాన్ ఎవరినీ ఉరితీయలేదు. 2025లో ఇరాన్, సౌదీ అరేబియా అత్యధిక దోషులను ఉరితీశాయి. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదికల ప్రకారం.. మయన్మార్‌లో బై కుటుంబంతో సంబంధం కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను ఒక కుంభకోణానికి సంబంధించి చైనా అధికారులు ఉరితీశారు. జనవరి 29న చైనా మింగ్ కుటుంబంతో సంబంధం ఉన్న 11 మంది వ్యక్తులను కూడా అక్కడి అధికారులు ఉరితీశారు.

READ ALSO: MLA Arava Sridhar Controversy: పరువు, శరీరం కోల్పోయా.. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో మరో సెల్ఫీ వీడియో!

2025లో 356 మందికి ఉరిశిక్ష..
సౌదీ అరేబియా 2025లో 356 మందికి ఉరిశిక్ష విధించింది. ఇది ఒక దేశం ఏడాది కాలంలో విధించిన అత్యధిక ఉరిశిక్షల సంఖ్య. సౌదీ అరేబియా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2025లో మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలకు 243 మందికి ఉరిశిక్ష విధించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా దేశం అనుసరిస్తున్న కఠినమైన విధానం కారణంగా ఈ ఉరిశిక్షల సంఖ్య గణీయంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 2024లో అమలు చేసిన ఉరిశిక్షలు 338 కంటే 2025లో అమలు చేసినవి ఎక్కువ. గతంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు సౌదీ దేశంలో ఉరిశిక్షలను నిలిపి వేసిన తర్వాత, 2022 ఏడాది చివరిలో మాదకద్రవ్యాల నేరాలకు తిరిగి మరణశిక్షను ప్రవేశపెట్టింది.

2025లో అమలు చేసిన మరణశిక్షల పరంగా ఇతర దేశాలకు సంబంధించిన కచ్చితమైన గణాంకాలు అందుబాటులో లేవు. 2024లో ఇరాన్, ఇరాక్ రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి. పలు నివేదికల ప్రకారం.. 2024లో ఇరాన్‌లో 972 మందికి ఉరిశిక్ష అమలు చేయగా, ఇరాక్‌లో 63 మందికి ఉరిశిక్షలు విధించారు. చైనాలో అత్యధిక సంఖ్యలో మరణశిక్షలు అమలు చేశారని నమ్ముతారు, కానీ డ్రాగన్ దేశం వాస్తవిక అధికారిక గణాంకాలు ఎప్పుడూ చెప్పలేదు.

READ ALSO: IND vs PAK Match Refund: భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడకపోతే.. ఫ్యాన్స్‌కు రీఫండ్ వస్తుందా?

Exit mobile version