Raipur : మనీ లాండరింగ్ ఆరోపణలపై సీఎం డిప్యూటీ సెక్రటరీ అరెస్ట్

Saumya Chaurasia

Saumya Chaurasia

Raipur : మనీలాండరింగ్ ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ఉన్నత స్థాయి అధికారిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియాను ఈడీ అరెస్టు చేసి నాలుగు రోజుల కస్టడీకి పంపింది. అరెస్టు తర్వాత చౌరాసియాను ఆరోగ్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లేదా సిఆర్‌పిఎఫ్ ఎస్కార్ట్‌తో ఆమెను స్థానిక కోర్టుకు తరలించారు. అక్టోబర్‌లో ఈడీ సమీర్ విష్ణోయ్‌(ఐఏఎస్)తో పాటు మరో ఇద్దరుని ఈ కేసు విషయంలో అరెస్టు చేసింది.

Read Also: LAGOS : 11రోజులు అన్నం, నీళ్లు లేకుండా ఓడ వెనుక కూర్చుని..3,200 కి.మీ. ప్రయాణం

ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదు మేరకు ఈడీ మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ఛత్తీస్‌గఢ్‌లో రవాణా చేయబడిన ప్రతి టన్ను బొగ్గుకు రూ.25లకు లెవీ ట్యాక్స్ పేరిట వసూళ్లకు పాల్పడిన ఆరోపణల్లో వీరున్నారు. వీరితో పాటు సీనియర్ బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, మధ్యవర్తులు మరికొందరు ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2020లో చౌరాసియా ఇంటిపై కూడా దాడి జరిగింది. అప్పట్లో జరిగిన దాడిని ముఖ్యమంత్రి రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. గత వారం, ఈడీ, ఆదాయపు పన్ను అధికారులు అదుపులోకి తీసుకున్న వ్యాపారులు, అధికారులను రాడ్లతో కొట్టారని మిస్టర్ బాగెల్ ట్వీట్లలో ఆరోపించారు. విచారణ సమయంలో ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేయాలని ఆయన కోరారు.