చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగనుకు లేదు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.. సీబీఐ, ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు.. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై పురంధేశ్వరి మాట్లాడిన వెంటనే చంద్రబాబుపై మద్యం కేసు పెట్టారు అని ఆయన ఆరోపించారు. రెండు రోజుల క్రితం వైసీపీ చేస్తోన్న ఇసుక కుంభకోణం గురించి పురందేశ్వరి మాట్లాడితే ఇసుక కేసు కూడా పెడతారనుకున్నా, అలాగే పెట్టారు.. జగన్ చేస్తున్న అక్రమాలపై ఈడీ, సీబీఐల విచారణను పురంధేశ్వరి కోరితే.. జగన్ సీఐడీని రంగంలోకి దించుతున్నారు అని సోమిరెడ్డి మండిపడ్డారు.
Read Also: Skill Development Scam: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్
జగన్ ప్రభుత్వం చేసే కుంభకోణాలపై పురంధేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేస్తుండడంతో జగనులో భయం పట్టుకుంది అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సీబీఐ, ఈడీలు ఎప్పుడు వస్తాయో తెలీదు కానీ.. సీఎం జగన్ తన చేతిలో ఉన్న సీఐడీ ద్వారా చంద్రబాబుపై కేసులు పెట్టిస్తున్నారు.. చంద్రబాబు సహా మాజీ మంత్రులందర్నీ జైలుకు పంపుతామని వైసీపీ నేతలు చెబుతూనే ఉన్నారు అని ఆయన ఆరోపించారు. ఏపీలో జగన్ బూటు కాలి కింద ప్రజాస్వామ్యం చచ్చింది.. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఏపీ లిక్కర్ స్కాం జరిగింది.. జగన్, వైసీపీ నేతలు యేట్లో పోయే ఇసుకను కూడా దోచేశారు.. మేం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తే.. మాపై కేసులు పెడతారా?.. దోపిడీ సొమ్మును జగన్ ట్రక్కుల్లో తరలించుకుని వెళ్తుంటే.. సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.