NTV Telugu Site icon

Chandrababu Release: రాజమండ్రి టు విజయవాడ.. 14 గంటల పాటు సాగిన చంద్రబాబు ప్రయాణం..

Babu

Babu

Chandrababu Release: రాజమండ్రి టు విజయవాడ.. సాధారణంగా కారులో వెళ్తే 3 గంటల్లోపే చేరుకోవచ్చు.. అదే వీఐపీ.. జడ్+ సెక్యూరిటీ ఉన్నవాళ్లు అయితే.. అటు ఇటుగా రెండు – రెండున్నర గంటల్లోపే చేరుకునే అవకాశం ఉంటుంది.. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి నుంచి విజయవాడలోని తన నివాసానికి చేరుకోవడానికి 14 గంటల సమయం పట్టింది.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు.. 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం విదితమే కాగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో.. మంగళవారం రోజు సాయంత్రం 4.15 గంటల సమయంలో ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు.. రాజమండ్రి సెంట్రల్‌ జైలు వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.. అంతే కాదు.. ఆయనకు దారి పొడవునా నీరాజనాలు పట్టారు.. టపాసులు కాల్చారు.. పూల వర్షం కురిపించారు.. హారతలు పట్టారు.. అలా 14 గంటల పాటు ఆయన ప్రయాణం కొనసాగింది..

చంద్రబాబు ఈ 14 గంటల ప్రయాణంలో దాదాపు 15 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు 200 మందికి పైగా చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది ఉండగా.. దారిపొడవునా లక్షలాది మంది టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు.. ఇలా మంగళవారం రోజు సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో రాజమండ్రి నుంచి బయల్దేరిన చంద్రబాబు.. ఈ రోజు అంటే బుధవారం రోజు ఉదయం 6 గంటల సమయంలో విజయవాడలోని తన నివాసానికి చేరుకున్నారు.. బెజవాడలో రాత్రి 3 గంటలు దాటాక కూడా వేచి ఉన్నారు జనం.. గన్నవరం విమానాశ్రయం వద్ద చంద్రబాబు ప్రయాణిస్తున్న కారు మొరాయించటంతో మరొక కారులోకి టీడీపీ అధినేత షిఫ్ట్‌ అయ్యారు.. విజయవాడ నుండి తెప్పించిన బ్లాక్ ల్యాండ్ క్రూజర్ కారులోకి మారారు చంద్రబాబు.. రాత్రి 3 గంటల ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్ విజయవాడ శివారు ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు వైపుగా ముందుకు సాగింది. తెల్లవారుజామున సైతం రోడ్లవెంట పెద్దసంఖ్యలో మహిళలు, అభిమానులు, ప్రజలు రోడ్లవెంట బారులు తీరి చంద్రబాబుకు స్వాగతం పలికారు.. కాన్వాయ్ అవిశ్రాంతంగా ముందుకు సాగడంతో.. చంద్రబాబు అలసిపోయినట్టు కనిపించారు.. ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోగానే.. చంద్రబాబుకి స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు. రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల అయిన నారా చంద్రబాబు నాయుడు ఉదయం 6 గంటలకు ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భం చంద్రబాబు కుటుంబ సభ్యులు, బంధువులు ఆయనను చూసి భావోద్వేగానికి గురి అయ్యారు. వారికి చంద్రబాబు దైర్యం చెప్పారు. అయితే.. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎక్కడ ప్రసంగించలేదు చంద్రబాబు.. కోర్టు ఆంక్షల నేపథ్యంలో కారు కూడా దిగకుండా ముందుకు సాగారు..

ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు చంద్రబాబు. చంద్రబాబును పరామర్శించేందుకు నేతలు, కార్యకర్తలెవరూ రావద్దని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశాడు… ఇక, ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ వెళ్లనున్నారు చంద్రబాబు. రేపు హైదరాబాద్ ఏఐజీ, ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోనున్నారు.. మరోవైపు.. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాకు అచ్చెన్నాయుడు వాట్సాప్ మెసేజ్ పంపారు. కోర్టు నిబంధనలకు లోబడి చంద్రబాబు ప్రయాణం సాగిందని వాట్సాప్ మెసేజ్ లో పేర్కొన్నారు అచ్చెన్న. వేలాదిగా ప్రజలు వచ్చినా ఎక్కడా వాహనం దిగలేదని అచ్చెన్నాయుడు వెల్లడించారు. తన కాన్వాయ్‌ వెంబడి ఎలాంటి వాహనాలు అనుమతించొద్దని సీఐ రాజుకు చంద్రబాబు చెప్పారనే విషయాన్ని సీపీకి వివరించారు అచ్చెన్నాయుడు. ఇదే విషయాన్ని తన ప్రయాణం పర్యవేక్షిస్తున్న డీసీపీకి తెలపాలని చంద్రబాబు కోరారని వాట్సాప్ మెసేజ్ ద్వారా సీపీకి వెల్లడించారు అచ్చెన్నాయుడు.