Indigo Crisis: ఇండిగో విమానయాన సంస్థ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సంక్షోభానికి కారకులైన వారిని గుర్తించి, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది. సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. అయితే, ప్రయాణికులు 011 2461 0843, 2469 3963, 096503 91856 నెంబర్లకు కాల్ చేయాలని పేర్కొనింది. ఈ కంట్రోల్ రూం ద్వారా బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర సర్కార్ వెల్లడించింది.
అలాగే, ఎఫ్డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. డీజీసీఏ ఇచ్చిన ఎఫ్డీటీఎల్ ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నామని తెలియజేసింది. ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని చెప్పుకొచ్చింది. ఈ పరిస్థితులను వీలైనంత త్వరగా చక్కదిద్దుతామని.. 3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే ఇండిగో హామీ ఇచ్చింది. అలాగే, రద్దైన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఇక, ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచనలు చేసింది.
