కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ డీఏ (Dearness Allowance) పెంపు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపు ప్రకటన మార్చిలోనే రావాల్సి ఉన్నా, ఏప్రిల్ వచ్చినా ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
ప్రకటన ఆలస్యమవుతోందా..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీనిని ఆలస్యంగా భావించలేము. డిసెంబర్ వరకు ఉన్న ద్రవ్యోల్బణం లెక్కలు (AICPI నంబర్లు) సేకరించి, వాటిని ఆర్థిక శాఖ పరిశీలించి, ఆపై క్యాబినెట్ ఆమోదం పొందేందుకు కొంత సమయం పడుతుంది. ఈ ప్రక్రియ క్రమ పద్ధతిలో జరుగుతోందని, త్వరలోనే నిర్ణయం వెలువడవచ్చని భావిస్తున్నారు.
Also Read:Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్ స్వాధీనం..
డీఏ ఎంత పెరగవచ్చు..?
ప్రస్తుత అంచనాల ప్రకారం, ఈసారి 3 శాతం నుంచి 4 శాతం వరకు డీఏ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే డీఏ 50 శాతం మార్కును దాటిన నేపథ్యంలో.. తాజా పెంపుతో ఇది 53 శాతం లేదా 54 శాతానికి చేరుకోవచ్చని నిపుణులు లెక్కగడుతున్నారు. గత ఏడాది కాలంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) ఆధారంగా ఈ పెంపును నిర్ణయిస్తారు.
పెన్షనర్లకు కలిగే ప్రయోజనం..
ఉద్యోగులకు డీఏ ఎలా పెరుగుతుందో, పెన్షనర్లకు కూడా డియర్నెస్ రిలీఫ్ (DR) రూపంలో అంతే శాతం పెరుగుదల ఉంటుంది. పదవీ విరమణ చేసిన వారికి స్థిరమైన ఆదాయం ఉంటుంది కాబట్టి, ఈ 3-4 శాతం పెంపు కూడా వారి నెలవారీ ఖర్చులకు, చేతిలో నగదు ఉండేదుకు ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం ఏప్రిల్ నెల నడుస్తోంది కాబట్టి.. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఏ క్షణమైనా ప్రకటన రావచ్చు. పెరిగిన ధరల దృష్ట్యా ఈ చిన్న పెంపు కూడా లక్షలాది కుటుంబాలకు కొంత ఊరటనిస్తుందని చెప్పవచ్చు.
