West Bengal: మమతా బెనర్జీ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్ట్ బిగ్ షాక్..

Bengal

Bengal

పశ్చిమ బెంగాల్‌లోని మమత బెనర్జీ ప్రభుత్వానికి ఈ రోజు పెద్ద షాక్ తగిలింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంపై ఇవాళ (సోమవారం) తీర్పు వెలువరిస్తూ కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ 2016 నాటి మొత్తం ప్యానెల్‌ను రద్దు చేయాలని ఆదేశించింది. 9, 10, 11, 12వ తరగతిలో గ్రూప్‌- సీ, గ్రూప్‌- డీలో స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ చేసిన నియామకాలన్నీ చట్టవిరుద్ధమని తెలిపింది. దీంతో 23 వేల 753 మంది ఉద్యోగాలను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరందరూ నాలుగు వారాల్లోగా 12 శాతం వడ్డీతో పాటు వారి మొత్తం జీతాన్ని తిరిగి ఇవ్వాలి అని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ వ్యక్తుల దగ్గర నుంచి ఆరు వారాల్లోగా డబ్బులు వసూలు చేయాలని జిల్లా అధికారులను కోర్టు ఆదేశించింది.

Read Also: Asaduddin Owaisi: ఓట్లు పొందాలంటే ముస్లింలను తిట్టడమే ఉత్తమ మార్గం..

అలాగే, దీంతో పాటు జీరో పోస్టులపై కొత్త నియామకాలు ప్రారంభించాలని స్కూల్ సర్వీస్ కమిషన్‌ను కలకత్తా హైకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు కొనసాగుతుంది.. ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. 23 లక్షల మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం చెప్పుకొచ్చింది. రానున్న 15 రోజుల్లో కొత్త నియామకాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు అధికార యంత్రాంగానికి తెలిపింది.