కర్ణాటకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్లోని గుంతకల్ మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద రూ.1,264 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. మొత్తం 46 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే మార్గంలో వేదావతి నదిపై 762 మీటర్ల భారీ మెగా వంతెనతో పాటు 7 ప్రధాన వంతెనలు, 52 చిన్న వంతెనలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు పనులను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ విస్తరణ ద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని 3 జిల్లాల్లో విస్తరించి ఉన్న 99 గ్రామాలలోని సుమారు 7 లక్షల మంది ప్రజలకు నేరుగా రవాణా ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా రైలు మార్గంలో రద్దీ తగ్గి, ప్రయాణాలు వేగవంతమవుతాయి. ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి, ధాన్యాల రవాణా సులువై, ఏడాదికి అదనంగా 16.22 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా.. బళ్లారి కోట, శ్రీ కుమారస్వామి దేవాలయం వంటి పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గి, కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవ్వడంతో పాటు బొగ్గు ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.

