బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్లో కన్నడ నటి కృషి తపండ నివాసంలో వ్యాపారవేత్త వైశాక్ మృతదేహం కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. తీవ్ర మనోవేదన (డిప్రెషన్)తో బాధపడుతున్న వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతుడిని వైశాక్గా గుర్తించారు. గత వారం రోజులుగా ఆయన నటి కృషి తపండ ఇంట్లోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో కృషి తపండ యలహంక ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు కృషి తపండ ఇంట్లో లేనట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే ఫోన్ సంభాషణలో బెదిరింపు ధోరణి రావడంతో నటి కుటుంబ సభ్యులను అలర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. కానీ అంతలోనే జరగాల్సింది జరిగిపోయినట్లుగా సమాచారం.
డిప్రెషన్తో చికిత్స
వైశాక్ కొంతకాలంగా డిప్రెషన్కు చికిత్స పొందుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో కూడా ఆయన తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. తరచూ కుటుంబ కలహాలు జరగడంతో గత నెల రోజులుగా భార్యకు దూరంగా నివసిస్తున్నట్లు సమాచారం వైశాక్ గతంలో ప్రముఖ వ్యాపారవేత్త, న్యాయవాది అరవింద్ రెడ్డికి సంబంధించిన బెదిరింపు లేఖల కేసులో పోలీసుల దృష్టిలోకి వచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అరవింద్ రెడ్డికి రూ.6-7 కోట్ల డిమాండ్తో పాటు క్షమాపణ కోరుతూ బెదిరింపు లేఖ పంపిన కేసులో వైశాక్ను HAL పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఈ లేఖ పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యాడు. ఈ కేసులో తదుపరి దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 6న స్టే విధించింది. అంతకుముందు HAL పోలీసులు ఆయనను ఐదు రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారించారు.
వైశాక్ మృతిపై కుటుంబ సభ్యులు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. రాజరాజేశ్వరి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఈ ఘటనకు దారితీసిన కచ్చితమైన కారణాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

