Site icon NTV Telugu

Business Headlines 11-03-23: HULకి కొత్త అధిపతి. మరిన్ని వార్తలు

Business Headlines 11 03 23

Business Headlines 11 03 23

Business Headlines 11-03-23:

కొత్త అధిపతి రోహిత్ జవా

హిందుస్తాన్ యూనిలీవర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌ మరియు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా రోహిత్‌ జవా నియమితులయ్యారు. సంజీవ్‌ మెహతా రిటైర్‌ కానుండటంతో ఆయన స్థానంలో రోహిత్‌ జవా రానున్నారు. ఈయన ఇప్పుడు ఇదే సంస్థలో చీఫ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొత్త పదవీ బాధ్యతలను ఈ ఏడాది జూన్‌ 27వ తేదీన చేపట్టి ఐదేళ్లపాటు కొనసాగుతారు. రోహిత్‌ జవా నియామకానికి స్టాక్‌ హొల్డర్ల అంగీకారం పొందాల్సి ఉందని హిందుస్తాన్‌ యూనిలీవర్‌ తెలిపింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ క్లోజ్‌

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ను మూసివేశారు. నియంత్రణ సంస్థలు ఈ బ్యాంక్‌ ఆస్తులను జప్తు కూడా చేసుకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్‌ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్టార్టప్‌లు సైతం షాక్‌కు గురయ్యాయి. శాంతాక్లారా ప్రాంతంలోని SVB అనే ఫైనాన్షియల్‌ గ్రూప్‌నకు చెందిన సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌.. అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో 16వ స్థానంలో ఉంది. టెక్‌ బేస్డ్‌ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లకు నిధులు ఇస్తుంది. వాటాల విక్రయ ప్రకటనతో తాజా పరిస్థితి తలెత్తింది.

కాల్ సెంటర్లకు C/O భారత్‌

ప్రపంచవ్యాప్తంగా కాల్‌ సెంటర్లకు భారతదేశం కేంద్రంగా మారుతోంది. మన దేశంలో మెయింటనెన్స్‌ ఖర్చులు తక్కువ, ఉద్యోగుల్లో స్కిల్స్‌ ఎక్కువ, ఇంగ్లిష్‌ పర్ఫెక్ట్‌గా మాట్లాడుతుండటం వంటివి దీనికి కారణాలు. కాల్‌ సెంటర్‌ కొలువులు అత్యధికంగా లభిస్తున్న సిటీల లిస్టులో వరుసగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌ ఉన్నాయి. ఈ విషయాలను జాబ్‌ రిక్రూట్మెంట్‌ పోర్టల్‌ ఇండీడ్‌ తెలిపింది. కరోనా నేపథ్యంలో ఈ ఉద్యోగ నియామకాలు ఎక్కువగా జరిగినట్లు వెల్లడించింది.

స్మార్ట్ ఆడియో కళ్లజోడు

హైదరాబాద్‌లోని కనెక్ట్‌ గాడ్జెట్స్‌ అనే కంపెనీ స్మార్ట్‌ కళ్లద్దాలను ఆవిష్కరించింది. ఈ కళ్ల జోడుకి బ్లూటూత్‌ని కనెక్ట్‌ చేసుకోవచ్చు. తద్వారా స్మార్ట్‌ఫోన్‌తో కాల్స్‌ చేసుకోవచ్చు. రిథమ్‌ పేరుతో పిలిచే ఈ మోడ్రన్‌ కళ్లద్దాల్లో మైక్రోఫోన్‌ మరియు స్పీకర్లు కూడా అమర్చి ఉంటాయి. వీటితో పాటలు సైతం వినొచ్చు. 120 మిల్లీ యాంపియర్ అవర్ కెపాసిటీ బ్యాటరీ కలిగిన ఈ కళ్ల జోడు ధర 19 వందల 99 రూపాయలు మాత్రమేనని కనెక్ట్‌ సంస్థ కోఫౌండర్‌ ప్రదీప్‌ తెలిపారు.

కేంద్ర మంత్రి కీలక భేటీ

నేషనల్‌ స్టార్టప్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ 6వ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరగనుంది. దీనికి కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ అధ్యక్షత వహిస్తారు. ఈ మీటింగ్‌ థీమ్‌.. ఇండియా ఎట్‌ 2047.. అని ప్రభుత్వం పేర్కొంది. లాజిస్టిక్స్‌లో ఆవిష్కరణలు, ఇండియాని గ్లోబల్‌ స్కిల్‌ మార్కెట్‌గా తయారుచేయటం, ఇన్నోవేషన్‌ హబ్‌, ఉమెన్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, థీమాటిక్ సీడ్ ఫండ్స్, ఇండియన్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ ఎవల్యూషన్‌ తదితర అంశాలపై చర్చిస్తారు.

ఆల్-ఉమెన్ ప్రొడక్షన్ లైన్

అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ తమిళనాడులోని హోసూర్‌లో ఆల్‌-ఉమెన్‌ ప్రొడక్షన్‌ లైన్‌ను ఏర్పాటుచేసింది. మహిళా సాధికారతను సాధించటం, తయారీ రంగంలోకి మరింత మంది మహిళలను ఆకర్షించటం లక్ష్యంగా ఈ ఆలోచన చేశారు. ఇందులో వంద శాతం ఉద్యోగాలను మహిళలకే కేటాయిస్తారు. ప్రస్తుతం 80 మందితో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పని ప్రదేశంలో వైవిధ్యాన్ని ప్రోత్సహించటం మరియు సరికొత్త ఆవిష్కరణలు చేయటంలో ఇది గేమ్‌ ఛేంజర్‌లా మారుతుందని నిపుణులు అన్నారు.

Exit mobile version