ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారుల కోసం మరో బంపర్ ఆఫర్ను ప్రకటించింది. గతంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ‘బీఎస్ఎన్ఎల్ ఆజాదీ కా ప్లాన్’ను ఇప్పుడు మళ్ళీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థల రీఛార్జ్ ధరలు పెరుగుతున్న తరుణంలో.. సామాన్యులకు ఊరటనిచ్చేలా కేవలం రూ. 1 కే నెల రోజుల పాటు సేవలను అందించాలని నిర్ణయించింది.
ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు అద్భుతం అనే చెప్పాలి. కేవలం ఒక రూపాయి ఖర్చుతో వినియోగదారులు ఎన్నో సేవలను పొందవచ్చు. అపరిమిత వాయిస్ కాల్స్.. దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్కైనా 30 రోజుల పాటు ఉచితంగా మాట్లాడుకోవచ్చు. డేటా సౌకర్యం.. ప్రతిరోజూ 2జీబీ (2GB) హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే నెలకు మొత్తం 60జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. ఎస్సెమ్మెస్లు.. రోజుకు 100 ఎస్సెమ్మెస్లు (SMS) ఉచితం. వాలిడిటీ.. ఈ ప్లాన్ కాలపరిమితి 30 రోజుల వరకు ఉంటుంది. ఈ ఆఫర్లో భాగంగా కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి సిమ్ కార్డు కూడా ఉచితంగా అందజేస్తారు.
Also Read:
ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. ఇది కేవలం కొత్త వినియోగదారులకు (New Customers) మాత్రమే పరిమితం. ఇతర నెట్వర్క్ల నుంచి బీఎస్ఎన్ఎల్లోకి మారాలనుకునే వారికి లేదా కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశం. ఈ ప్లాన్ కేవలం ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఎలా పొందాలి.. ?
‘ఆజాదీ కా ప్లాన్’ను పొందాలనుకునే ఆసక్తి గల వారు తమ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా రిటైలర్ షాపును సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ అవసరమైన గుర్తింపు పత్రాలను సమర్పించి కేవలం రూ. 1 చెల్లించి కొత్త కనెక్షన్ పొందవచ్చు. తక్కువ ధరలో మెరుగైన సేవల కోసం ఎదురుచూస్తున్న వారికి, ముఖ్యంగా విద్యార్థులు , గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఈ నెలాఖరు లోపు బీఎస్ఎన్ఎల్ కుటుంబంలో చేరి ఈ భారీ ఆఫర్ను సొంతం చేసుకోండి.