NTV Telugu Site icon

Singer Sai Chand is No More: గాయకుడు సాయిచంద్‌ కన్నుమూత..

Sai Chand

Sai Chand

Singer Sai Chand is No More: ప్రముఖ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతిచెందారు.. ఆయన వయస్సు 39 ఏళ్లు..  నిన్న సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి వెళ్లారు సాయిచంద్.. అయితే, తన ఫామ్ హౌస్ లో అర్ధరాత్రి అస్వస్థకు గురైన ఆయనను.. వెంటనే చికిత్స కోసం నాగర్ కర్నూల్‌లోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో గాయత్రి ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది.. అయితే, సాయిచంద్ భార్య రజని కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.. కానీ, సాయిచంద్ అప్పటికే మృతిచెందినట్టు గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు..

Read Also: Health Tips : కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ తప్పనిసరిగా వీటిని తీసుకోవాలి..!

కాగా, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు సాయి చంద్‌.. ఏ కార్యక్రమం జరిగినా సాయిచంద్‌ పాట ఉండాల్సిందే.. యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తన పాట మాటతో చైతన్యవంతులను చేసిన కళాకారుల్లో ముందు వరుసలో ఉన్నారు.. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారు.. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ గొప్పతనాన్ని కీర్తిస్తూ.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పథకాలపై ఎన్నో పాటలను రాశారు.. సీఎం కేసీఆర్‌ ఎక్కడ సభ నిర్వహించినా.. అక్కడ సాయి చంద్‌ మాటల తూటాలు పేలాల్సిందే.. ఆయన నోట పాట పాడాల్సిందే అనేలా కీలకంగా మారిపోయారు.. ముఖ్యంగా రాతి గుండెల్లో కొలువైన శివుడా.. రక్త బంధం విలువ నీకు తెలియదురా.. అంటూ తెలంగాణ అమర వీరులపై సాయిచంద్‌ పాడిన పాట.. ఎన్నో హృదయాలను కదిలిచింది.. సీఎం కేసీఆర్‌ సైతం ఈ పాటకు కన్నీరు పెట్టుకున్నారు.. అమరవీరుల కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి.. మరోవైపు.. సాయిచంద్‌ను సీఎం కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌ను చేసి గౌరవించారు. ఆయన కన్నుమూయడంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపున్నారు.