భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ ఇంజినీరింగ్ ఆధీనంలోకి వెళ్లబోతుంది. మనిషి చేసే, చేయలేని పనులను కూడా రోబో చేస్తోంది. అయితే ఓ బాలుడు తనకు తెలిసిన వస్తువులతో మాట్లాడే రోబోను తయారు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్షహర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆదిత్య స్కూల్ అయిపోయనప్పటికి అక్కడే ఉండేవాడు. వైర్లు, సర్క్యూట్లు, పాత టీవీలు, మొబైల్స్ ఏది దొరికినా సేకరించేవాడు. చిన్నప్పటి నుంచే తన మామ దగ్గర చూసిన చిన్న రోబోలే అతని కలలకి ఊపిరిపోశాయి. సమాజానికి ఉపయోగపడే రోబోట్ను తానే తయారు చేయాలన్న సంకల్పం అతనిలో బలపడింది.
అనుకున్నదే తడవుగా.. బ్లాక్బోర్డు ముందు నిలబడి పాఠాలు చెప్పే రోబోట్ ను తయారు చేశాడు ఆదిత్య. దీనిని చూసిన గురువులూ, విద్యార్థులూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి అద్భుత రోబోట్ని తయారు చేసిన ఆదిత్య వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడి దగ్గర రోబోలు తయారు చేసేందుకు అవసరమయ్యే డబ్బు కూడా లేదు. అయినప్పటికి నిరుత్సాహ పడకుండా తనకు దొరికిన వస్తువులతోనే ఓ మాట్లాడే రోబోను తయారు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రోబోను చూసిన లక్షలాది మంది నెటిజన్లు “ఇదే నిజమైన టాలెంట్” అని ప్రశంసిస్తున్నారు.