NTV Telugu Site icon

Janhvi Kapoor Marriage: వారం రోజుల్లో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు: జాన్వీ

Janhvi Kapoor

Janhvi Kapoor

Janhvi Kapoor About Marriage With Shikhar Pahariya: రాజ్‌కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’. శరణ్‌ శర్మ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమాను అపూర్వ మోహతా, కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మించారు. క్రికెట్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో మహిమ పాత్రలో జాన్వీ.. మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్‌ కనిపించనున్నారు. మే 31న మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లతో జాన్వీ బిజీగా ఉన్నారు. ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

తాజా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ పాల్గొనగా.. పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది. మీ ప్రియుడు శిఖర్ పహారియాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని అడగ్గా.. అందుకు జాన్వీ నవ్వుతూ సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి కెరీర్‌పైనే దృష్టి పెట్టాను అని స్పష్టం చేశారు. ‘ఇటీవలి రోజుల్లో నేను కొన్ని వార్తలు చదివాను. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు రాశారు. నాకు తెలియకుండానే వారం రోజుల్లో నా పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. ప్రస్తుతం నేను కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నా. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు’ అని జాన్వీ తెలిపారు.

Also Read: PM Modi: నేడు ఒడిశాలో ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచారం..

శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్‌ ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్నాయి. జాన్వీ, శిఖర్ కలిసి చాలాసార్లు బయట కనిపించడమే ఇందుకు కారణం. వీరు తిరుమలకు కూడా ఓసారి కలిసే వెళ్లారు. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనువడే ఈ శిఖర్ పహారియా. ‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే శిఖర్‌తో పరిచయం ఉంది. ఇద్దరం కలిసే పెరిగాం. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. నా కలలను అతడి కలలుగా.. అతడి కలలను నా కలలుగా ఫీలవుతాము. ఏ పరిస్థితుల్లోనైనా మాకు మేం సపోర్టుగా ఉంటాం’ అని జాన్వీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.