NTV Telugu Site icon

Telangana Assembly Elections 2023: సెలబ్రిటీలను పక్కనబెట్టిన బీజేపీ.. వద్దుమొర్రో అన్న వ్యక్తికి టికెట్..!

Bjp

Bjp

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్ల సమర్పణకు మరొక్క మాత్రమే మిగిలి ఉంది. బీఆర్ఎస్‌ అభ్యర్థులందరికి బీ ఫామ్‌లు అందజేసింది. అటు కాంగ్రెస్‌ పార్టీ సైతం అభ్యర్థులకు ప్రకటించిన వారికి బీఫామ్‌లు అందజేసింది. బీ ఫామ్‌ అందుకున్న నేతలు ఇప్పటికే నామినేషన్లు సమర్పించారు. తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఇంకా 19 స్థానాలకు అభ్యర్థులను పెండింగ్ పెట్టింది. ఇప్పటి వరకు విడుదల చేసిన జాబితాల్లో ఒక్క సెలబ్రెటీకు కూడా టికెట్‌ ఇవ్వలేదు. కాషాయ పార్టీలో పేరున్న సెలబ్రెటీలు లేరా అంటే.. చాలా మందే ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్‌ నటీమణులుగా పేరున్న వారు ఉన్నారు. వీరిలో ఒక్కరికి కూడా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికట్లో టికెట్ కేటాయించలేదు. ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, సెన్సార్ బోర్డు సభ్యురాలు జీవితా రాజశేఖర్‌, మధవీలత, రేష్మా ఉన్నారు. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ కోస ప్రయత్నించిన ఒక్కరికీ వర్కౌట్‌ కాలేదని తెలుస్తోంది. సెలబ్రెటీలకు ప్రాధాన్యత ఇచ్చే బీజేపీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరికి టికెట్‌ కేటాయించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మాజీ మంత్రి బాబుమోహన్‌ బీజేపీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. సీన్‌ కట్ చేస్తే అందోల్‌ టికెట్‌ను బాబుమోహన్‌కు కేటాయించింది. వద్దుమొర్రో అన్న వ్యక్తికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వండి మహాప్రభో అన్నవారికి కట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనన్న వ్యక్తికి టికెట్‌ కేటాయించిన కాషాయ పార్టీ.. మహిళా నటుల్లో ఏ ఒక్కరికి పోటీ చేసే ఛాన్స్ ఇవ్వలేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు జయసుధ బీజేపీలో చేరారు. ఆమె గతంలో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అలాగే మెదక్ నుంచి విజయశాంతి ఎంపీగా పని చేశారు. వీరిద్దరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కమలం పార్టీ నేతలు వారికి టికెట్‌ నిరాకరించారు. అలాగే, నచ్చావులే ఫేం మాధవీలత, ఈ రోజుల్లో ఫేం రేష్మా రాథోడ్ టికెట్‌ కోసం ప్రయత్నించినా.. ఫలితం మాత్రం దక్కలేదు. టాలీవుడ్‌లో మంచి పేరున్న హీరోయిన్లు ఉన్నప్పటికీ.. జనంలో ఫేం ఉన్నా.. టికెట్‌ ఎందుకు ఇవ్వలేదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎప్పుడైనా.. ఎక్కడైనా బీజేపీ సెలబ్రిటీలకు ప్రాధాన్యత ఇస్తుంది.. కానీ, ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది హాట్‌టాపిక్‌గా మారిపోయింది.