Bihar Madarsa: బీహార్లోని మోతిహారి జిల్లాలో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక దాడులు ఇప్పుడు సంచలనం సృష్టించాయి. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో, ఒక మదర్సా ప్రాంగణంపై పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమ ఆయుధాలు, కీలక పత్రాలు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. ఈ దాడిలో సంఘటనా స్థలం నుంచి ఒక పిస్టల్, తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏదైనా పెద్ద నేరానికి లేదా విధ్వంసానికి పాల్పడేందుకు ఇక్కడ కుట్ర జరిగినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయుధాలతో పాటు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
READ ALSO: Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్ నిజం కాదు.. APSDMA క్లారిటీ..
మోతిహారి ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మాట్లాడుతూ.. ఈ మదర్సాలో ఆయుధాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయని, పెద్ద నేరానికి ప్రణాళికలు రచిస్తున్నారని ముందస్తు సమాచారం అందింది. దీంతో చకియా డీఎస్పీ సంతోష్ కుమార్, ఎస్హెచ్ఓ మున్నా కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం మదర్సాపై దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్ సందర్భంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను పిలిపించి సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మదర్సా ప్రాంగణాన్ని సీల్ చేసి, భారీ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. “అదుపులోకి తీసుకున్న వ్యక్తులకు ఏదైనా నేర ముఠాలతో లేదా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో లోతుగా విచారిస్తున్నాము” అని తెలిపారు. గతంలో ఇదే మదర్సా నుంచి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) తో సంబంధం ఉన్న యాకూబ్ (అలియాస్ సుల్తాన్)ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేసింది. అయోధ్య రామమందిరంపై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టి, బెదిరింపులకు పాల్పడిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారి నెట్వర్క్ ఎక్కడ వరకు విస్తరించింది అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నామన్నారు.
READ ALSO: Stock Market: మార్కెట్కు మధ్యాహ్నం నుంచి జోష్.. భారీ లాభాల్లో సూచీలు