భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ అనే థీమ్తో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఈ ప్రాంతానికి గేమ్చేంజర్గా మారుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్న ఈ ప్రారంభోత్సవాన్ని ప్రజలందరికీ చేరువ చేసేలా కలెక్టర్లు పోటీ పడి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో విమానాశ్రయం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేలా ప్రతి ఇంటా చర్చ జరిగే విధంగా ప్రచారం చేపట్టాలని సూచించారు.
విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా యువత, మహిళలు, విద్యార్థులు భాగస్వాములు అయ్యేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. యువత కోసం వాలీబాల్ పోటీలు, 3కే నుంచి 5కే రన్లు, పాటలు, పద్యాల పోటీలు నిర్వహించాలని సూచించారు. అలాగే విద్యార్థులకు విమానాశ్రయం వల్ల కలిగే ప్రయోజనాలపై క్విజ్, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని చెప్పారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 600 మంది విజేతలను ఎంపిక చేసి, వారికి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 31వ తేదీ రాత్రి నుంచే డ్రోన్ షోలను నిర్వహించాలని, ఫ్లాష్మాబ్లు, అవుట్రీచ్ కార్యక్రమాలు, ఉపన్యాస పోటీలు చేపట్టాలని సీఎం సూచించారు. స్థానిక పారిశ్రామికవేత్తలతో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించి, విమానాశ్రయం ద్వారా ఏర్పడే పెట్టుబడి, ఉపాధి అవకాశాలపై చర్చించాలని చెప్పారు. సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా విస్తృత ప్రచారం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాంధ్ర సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఘన స్వాగతం పలకాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయ జెండాలతో చిన్నారులు స్వాగతం పలకడంతో పాటు గిరిజన సంప్రదాయ థింసా నృత్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహ్వానించాలని సూచించారు. గిన్నిస్ రికార్డు సృష్టించేలా అత్యధిక సంఖ్యలో కళాకారులతో థింసా నృత్య ప్రదర్శన నిర్వహించాలని చెప్పారు. అరకు కాఫీతో పాటు ఉత్తరాంధ్ర పర్యాటక విశేషాలకు కూడా ఈ సందర్భంగా బ్రాండింగ్ కల్పించాలని సూచించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ప్రారంభంతో రాష్ట్ర విమానయాన రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సీఎం అన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా.. ఉపాధి, పర్యాటకం, వాణిజ్యం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రతో పాటు తెలుగు ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచే ప్రాజెక్టుగా ఇది నిలుస్తుందన్నారు.
విమానాశ్రయ టెర్మినల్ భవనం ప్రారంభం అనంతరం ఇంధన, ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖలకు చెందిన సుమారు రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని ఆగస్టు 1న ఉదయం 10:45 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకోనున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఉదయం 10:58 గంటలకు టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఓపెన్టాప్ వాహనంలో బహిరంగ సభా వేదికకు వెళ్తుండగా.. 13,500 మందికి పైగా గిరిజన మహిళలు, విద్యార్థులు థింసా నృత్యంతో ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:55 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ప్రధాని మధ్యాహ్నం 1:10 గంటలకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

