Rammohan Naidu: ప్రపంచమే మన దగ్గర ఉన్న అనుభూతి.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు!

Rammohan Naidu, Bhogapuram Airport

Rammohan Naidu, Bhogapuram Airport

Bhogapuram Airport Opens Today: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. విజయనగరం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ప్రయాణికుల రాకపోకలు అధికారికంగా మొదలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన తొలి విమానంగా నిలిచింది. ఈ సందర్భంగా విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల్లో ఉత్సాహం కనిపించింది. కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టిన అనుభూతిని ప్రయాణికులు ఆస్వాదించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు.

భోగాపురం విమానాశ్రయంలో సోమవారం నుంచి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ‘విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం ఉత్తరాంధ్ర చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉంది. భోగాపురం విమానాశ్రయాన్ని జీఎంఆర్‌ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఎయిర్‌పోర్ట్‌ కోసం సంస్థ ప్రాణం పెట్టి పనిచేసింది. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కొత్త గుర్తింపును తీసుకురానుంది’ అని చెప్పారు.

భోగాపురం విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం కావడంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లోని కొన్ని కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసిన పలువురు ఉద్యోగులు బాధకు గురయ్యారు. కొన్ని మంచి పనులు జరిగినప్పుడు కొంత మేర బాధ కూడా ఉంటుంది. విశాఖ విమానాశ్రయాన్ని భవిష్యత్తులో ఏ విధంగా వినియోగించాలనే దానిపై ప్రణాళిక రూపొందిస్తాము. విశాఖ నగరంతో పాటు భోగాపురం విమానాశ్రయానికి మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు రోడ్ల అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తున్నాము’ అని తెలిపారు.

విశాఖ నుంచి భోగాపురం వైపు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. బీచ్ కారిడార్ పనులను కూడా త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. విమానాశ్రయం, రోడ్లు, బీచ్ కారిడార్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని అన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్రను వెనుకబడిన ప్రాంతంగా చెప్పేవారని, ఇప్పుడు ఈ ప్రాంతంలోని జిల్లాలు అభివృద్ధి చెందుతున్నాయని రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలైందని పేర్కొన్నారు.

భోగాపురం విమానాశ్రయాన్ని చూస్తే ప్రపంచమే మన దగ్గర ఉన్నట్లుగా అనిపిస్తుందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజలకు కొత్త అవకాశాలను అందించనుందని చెప్పారు. కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణ సౌకర్యానికే పరిమితం కాకుండా.. పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల అభివృద్ధికి కూడా కీలకంగా మారనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.