Site icon NTV Telugu

Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

Korra Kichidi

Korra Kichidi

Korra Khichdi: ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ప్రస్తుతరోజుల్లో చాలామంది బరువు తగ్గడానికి లేదా షుగర్‌ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి బియ్యానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికి కొర్రలతో చేసే కిచిడీ మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. ప్రోటీన్, ఫైబర్, ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండే చిరుధాన్యాలతో తయారుచేసే ఈ కిచిడీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. చాలా సులభంగా తయారయ్యే ఈ వంటకం తిన్నా కొద్దీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది.

ఈ కిచిడీకి ప్రధానంగా కొర్రలు ఉపయోగిస్తారు. అయితే కొర్రలకు బదులుగా సామలు, ఊదలు, అరికెలు వంటి ఇతర మిల్లెట్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. సుమారు 150 గ్రాములు కొర్రలను నాలుగు నుంచి ఐదు గంటల ముందే నానబెట్టాలి. వీటీతోపాటు అర కప్పు పెసరపప్పు తీసుకోవాలి. కిచిడీకి రుచిని పెంచేందుకు క్యారెట్, టమాటా వంటి కూరగాయలు కూడా వాడతారు.

Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పెట్టుబడులు కలిసొస్తాయి!

ఇక ఆ తర్వాత స్టవ్‌పై కుక్కర్ పెట్టి అందులో పెసరపప్పును మూడు నిమిషాలు లైట్‌గా వేయించాలి. పప్పు కొంచెం రంగు మారి పచ్చి వాసన పోయిన తర్వాత ప్లేట్‌ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తర్వాత దాన్ని కడిగి పక్కన పెట్టాలి. ఇదే సమయంలో ముందుగా నానబెట్టిన మిల్లెట్స్‌ను కూడా నీళ్లు వంపేసి రెడీగా ఉంచుకోవాలి. అదే కుక్కర్‌ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. అందులో బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, నాలుగు లవంగాలు, రెండు యాలకులు వేసి లైట్‌ గా వేయించాలి. తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటమన్నాక పచ్చిమిరపకాయలు వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి.

ఉల్లిపాయలు మెత్తగా మారిన తర్వాత క్యారెట్ ముక్కలు, టొమోటో ముక్కలు వేసి మరో రెండు మూడు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇష్టముంటే బఠానీ లేదా ఆలూ వంటి ఇతర కూరగాయలను కూడా కలపవచ్చు. ఇప్పుడు నానబెట్టిన మిల్లెట్స్, కడిగిన పెసరపప్పును కూడా వేసి ఒకటి రెండు నిమిషాలు వేయించాలి.

Brown Rice Dosa: తెల్ల బియ్యం దోశలకు గుడ్‌బై.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇంట్లోనే క్రిస్పీ, టేస్టీగా బ్రౌన్ రైస్ దోశ ట్రై చేయండి..

ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నాలుగు కప్పుల నీరు పోసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్‌పై మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ తగ్గిన తర్వాత మూత తీసి చూస్తే కిచిడీ చక్కగా ఉడికిపోతుంది. చివరగా కొత్తిమీర వేసి కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ కిచిడీని పచ్చడి లేదా అప్పడాలతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది.

Exit mobile version