IPL 2025: మే 15న ఐపీఎల్‌ పున:ప్రారంభం.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే?

  • వారం పాటు నిలిచిపోయిన ఐపీఎల్‌ 2025 మ్యాచ్‌లు
  • ఐపీఎల్ 2025ను పునఃప్రారంభించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు
  • మే 15 లేదా 16న ఐపీఎల్‌ పునః ప్రారంభమయ్యే అవకాశం
Ipl 2025 Restarts

Ipl 2025 Restarts

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 మ్యాచ్‌లు వారం పాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. శనివారం కాల్పుల విరమణ అంగీకారంతో.. భారత్, పాక్ మధ్య యుద్ధం ముగిసింది. యుద్ధం ముగియడంతో ఐపీఎల్ 2025ను పునఃప్రారంభించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలెట్టింది. భారత ప్రభుత్వం టోర్నీకి అనుమతిస్తే.. మే 15 లేదా 16న ఐపీఎల్‌ పునః ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మే 30న ఐపీఎల్ 2025 ఫైనల్ జరగనుందని తెలుస్తోంది. ఈరోజు రాత్రికి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

మే 13 లోగా పంజాబ్ కింగ్స్ టీమ్ మినహా మిగతా 9 జట్ల ఆటగాళ్లు తమ హోం గ్రౌండ్‌లలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఫ్రాంఛైజీలకు బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తోంది. అన్ని టీమ్స్ తమ విదేశీ ఆటగాళ్ల ప్రయాణ ప్రణాళికలను తెలియజేయాలని కోరిందట. బీసీసీఐ ఆదేశాల మేరకు తమ విదేశీ ఆటగాళ్లను వెనక్కి రప్పించడానికి ఫ్రాంఛైజీలు ఏర్పాట్లు చేస్తున్నాయని సమాచారం. లీగ్ దశలో మిగిలిన 12 మ్యాచ్‌లను డబుల్ హెడర్‌లతో ముగించాలని బీసీసీఐ ప్లాన్ చేసిందని సమాచారం. పంజాబ్ కింగ్స్‌కు తటస్థ వేదికను ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది.

Also Read: Murali Naik: మురళీ నాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షలు, 5 ఎకరాల పొలం.. తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం!

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో మిగిలిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను బీసీసీఐ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025లో ఇంకా 12 లీగ్‌ మ్యాచులు ఉన్నాయి. అలానే రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్‌ మ్యాచ్‌ ఉంది. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం మే 25న కోల్‌కతాలో ఫైనల్‌ మ్యాచ్ జరగాల్సి ఉంది. టోర్నీ నిలిచే సమయానికి పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ (16), బెంగళూరు ఛాలెంజర్స్ బెంగళూరు(16), పంజాబ్ కింగ్స్ (15), ముంబై ఇండియన్స్ (14) టాప్ 4లో ఉన్నాయి.