NTV Telugu Site icon

IND vs BAN: బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. ముంబై యువ స్పిన్న‌ర్‌కు ఆహ్వానం!

Himanshu Singh Team India

Himanshu Singh Team India

టీమిండియా ప్లేయర్స్ 45 రోజుల విరామం అనంతరం తిరిగి మైదానంలో అడుగు పెట్టనుంది. సెప్టెంబ‌ర్ 19 నుంచి స్వ‌దేశంలో ఆరంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ సిరీస్ కోసం వ‌చ్చే వారం భార‌త జ‌ట్టును ప్ర‌కటించే అవకాశం ఉంది. దులీప్ ట్రోఫీ 2024 ప్రదర్శన ఆధారంగా కొందరు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉంది. బంగ్లాతో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక‌యిన భారత ప్లేయర్స్ సెప్టెంబ‌ర్ 12న చెన్నైలో స‌మావేశం కానున్నారు.

సెప్టెంబర్ 13 నుండి 18 వరకు తొలి టెస్టు కోసం చెపాక్‌లో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంపులో భారత ఆట‌గాళ్లు పాల్గొననున్నారు. అయితే ప్రాక్టీస్ నేపథ్యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముంబై యువ ఆఫ్ స్పిన్న‌ర్ హిమాన్షు సింగ్‌ను నెట్ బౌల‌ర్‌గా ఎంపిక చేసింది. చెన్నైలోని టీమిండియా ప్రాక్టీస్ క్యాంప్‌లో చేరాల‌ని హిమాన్షును బీసీసీఐ ఆదేశించింది. బంగ్లా జ‌ట్టులో క్వాలిటీ స్పిన్న‌ర్లు ఉన్నారు. వారిని స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొనేందుకు ఆఫ్ స్పిన్న‌ర్ హిమాన్షు బౌలింగ్‌లో భార‌త జ‌ట్టు ప్రాక్టీస్ చేయ‌నుంది.

Also Read: Bhagyashri Borse: లక్కీ ఛాన్స్ కొట్టేసిన భాగ్యశ్రీ బోర్సే.. స్టార్ హీరోతో రొమాన్స్!

ఇటీవ‌ల శ్రీలంక పర్యటనలో భారత బ్యాటర్లు స్పిన్నర్లకు దాసోహమైన విషయం తెలిసిందే. స్పిన్‌ను ఆడలేక స్టార్ బ్యాటర్లు కూడా ఇబ్బందిపడ్డారు. అందుకే హిమాన్షు సింగ్‌ను నెట్ బౌల‌ర్‌గా బీసీసీఐ ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. 21 ఏళ్ల హిమాన్షు డాక్టర్ కె తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్‌లో రాణించాడు. తాజాగా ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్స్ తీశాడు. ఇదే ప్రదర్శన చేస్తే.. భవిష్యత్తులో హిమాన్షు భరత్ తరఫున ఆడడం ఖాయమే.