NTV Telugu Site icon

BC Poru Garjana: న్యూఢిల్లీలో బీసీల పోరు గర్జన.. హాజరు కానున్న రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి!

Bc Reservation

Bc Reservation

విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. బీసీ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులను పార్లమెంట్‌ ఆమోదించి.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద బీసీల పోరు గర్జన కార్యక్రమాన్ని బుధవారం చేపడుతున్నాయి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన సుమారు1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో సోమవారమే రాజధానికి బయలుదేరి వెళ్లారు.

బీసీల పోరు గర్జనకు కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సహా బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్​కు చెందిన బీసీ నేతలు మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 1500 మంది బీసీ ప్రతినిధులు హాజరు కానున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహా 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Also Read: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్

ఐతే బీసీ పోరు గర్జన సభకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా.. రెండు పార్టీలు సైలెంట్​గానే ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు ఎవరూ ఢిల్లీకి వెళ్లలేదు. ఇక బీసీ పోరుగర్జనకు తాము హాజరుకాలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లు బీసీ సంఘాల నేతలు అంటున్నారు. కీలక ధర్నాకు హాజరుకాకపోవడంపై సొంత పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని తెలుస్తోంది.