Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు

  • మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్!
  • భారత్‌పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
  • ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ప్రకటన
Makkah Deal

Makkah Deal

ఇటీవల ఇస్లామిక్ నాటో ఏర్పడింది. పాకిస్థాన్-సౌదీ అరేబియా-టర్కీ కలిపి మక్కా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ఒకరిపై దాడి చేస్తే.. శత్రువుపై మూడు దేశాలు కలిపి దాడి చేయడమే ఈ ఒప్పందం ఉద్దేశం. అయితే ఈ ఒప్పందంలోకి బంగ్లాదేశ్ కూడా చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టర్కీ హామీ మేరకు బంగ్లాదేశ్ బాగా ఆసక్తి చూపుతున్నట్లుగా సమాచారం. టర్కీకి భారత్‌పై ఉన్న కోపంతో బంగ్లాదేశ్‌ను ఈ ఒప్పందం లాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లుగా కనిపిస్తోంది.

అయితే ఈ పరిణామంపై భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. బంగ్లాదేశ్ జమాత్-ఎ-ఇస్లామీ నేత షఫీకుర్ రెహ్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ తీసుకునే నిర్ణయం పూర్తిగా సార్వభౌమ అంశమని.. దీనిపై ఎవరూ “ఆందోళన చెందాల్సిన అవసరం లేదని” అన్నారు. బంగ్లాదేశ్ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్న షఫీకుర్ రెహ్మాన్ ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “మక్కా ప్యాక్ట్‌లో చేరడం పూర్తిగా బంగ్లాదేశ్ సార్వభౌమ, అంతర్గత వ్యవహారం. దేశం, ప్రజల అవసరాలు, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బంగ్లాదేశ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాని గురించి ఇతరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలకు ముందు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ సీనియర్ దౌత్యవేత్త.. ఈ కూటమితో మరింత సన్నిహిత సంబంధాలపై ఢాకా ఆసక్తిగా ఉందని సూచించారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ మాట్లాడుతూ.. పశ్చిమాసియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల నుంచి బంగ్లాదేశ్ నాయకత్వానికి ఆహ్వానాలు వస్తున్నాయని తెలిపారు. ప్రధానంగా బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నాయకత్వంతో కలిసి పనిచేయాలని పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. “పశ్చిమాసియాలో ఒక భద్రతా ఒప్పందం ఉంటే.. ఇస్లామిక్ దేశాల మధ్య భద్రతా ఒప్పందం ఉంటే.. అందులో చేరడం అసాధారణ విషయం కాదు” అని టర్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనడోలు ఏజెన్సీకి ఇచ్చిన వ్యాఖ్యల్లో కబీర్ పేర్కొన్నారు.

భారత్‌కు ఎందుకు కీలకం?

బంగ్లాదేశ్ మక్కా డిఫెన్స్ ప్యాక్ట్‌లో చేరే అవకాశం భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకంగా మారవచ్చు. ఎందుకంటే ఈ ఒప్పందానికి పాకిస్థాన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకటి. భారత్, బంగ్లాదేశ్ మధ్య దశాబ్దాలుగా భద్రత, వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో సంబంధాలు కొనసాగుతున్నాయి. మరోవైపు 1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిన సమయంలో భారత్ కీలక పాత్ర పోషించింది. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్నప్పటికీ.. పాకిస్థాన్ భాగస్వామిగా ఉన్న భద్రతా కూటమిలో బంగ్లాదేశ్ చేరితే దాని ప్రభావం దక్షిణాసియా వ్యూహాత్మక సమీకరణాలపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగ్లాదేశ్ అధికారికంగా లౌకిక గణతంత్ర దేశమైనప్పటికీ.. దేశ జనాభాలో 90 శాతానికి పైగా సున్నీ ముస్లింలే ఉన్నారు. అందువల్ల ముస్లిం దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలా? లేక భారత్‌తో ఉన్న సుదీర్ఘ సంబంధాలను కొనసాగించాలా? అనే అంశాన్ని ఢాకా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

అసలు మక్కా ప్యాక్ట్ అంటే ఏమిటి?

అమెరికా-ఇరాన్ మధ్య విస్తృత ఘర్షణ కొనసాగుతున్న సమయంలో సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ ఇటీవల మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఒక సభ్య దేశంపై దాడిని.. అన్ని సభ్య దేశాలపై దాడిగా పరిగణించేలా పరస్పర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం ద్వారా సమష్టి నిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు.. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఘర్షణను పరిష్కరించేందుకు చేపట్టే ప్రయత్నాల్లోనూ మూడు దేశాలు భాగస్వామ్యం కావాలని అంగీకరించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ ప్యాక్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం ప్రాంతాల్లో నౌకాయానం, వాణిజ్యంపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

పాకిస్థాన్‌తో కలిసి పనిచేయనున్న బంగ్లాదేశ్?

బంగ్లాదేశ్ మక్కా ప్యాక్ట్‌లో చేరితే పాకిస్థాన్‌కు మరో కీలక భాగస్వామి లభించినట్లవుతుంది. సౌదీ అరేబియా, టర్కీతో కలిసి పాకిస్థాన్ భాగస్వామిగా ఉన్న భద్రతా వ్యవస్థ పరిధి మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. అయితే బంగ్లాదేశ్-పాకిస్థాన్ సంబంధాలకు 1971 యుద్ధం కారణంగా సంక్లిష్టమైన చారిత్రక నేపథ్యం ఉంది. పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. ఆ సమయంలో భారత్ బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మద్దతుగా సైనికంగా జోక్యం చేసుకుంది. అందువల్ల పాకిస్థాన్‌తో కలిసి ఉన్న భద్రతా ఒప్పందంలో చేరే అంశం ఢాకాకు దౌత్యపరంగా సున్నితమైన నిర్ణయంగా మారే అవకాశం ఉంది.

ఇంకా అధికారిక నిర్ణయం లేదు

ప్రస్తుతం బంగ్లాదేశ్ మక్కా ప్యాక్ట్‌లో అధికారికంగా చేరినట్లు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజా వ్యాఖ్యలు, దౌత్యపరమైన సంకేతాలు చూస్తే.. సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్‌తో పాటు ఇతర ముస్లిం దేశాలతో భద్రతా సంబంధాలను మరింత పెంచుకునే అంశాన్ని ఢాకా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ తీసుకునే నిర్ణయం తమ సార్వభౌమ హక్కులో భాగమేనని జమాత్ నేత షఫీకుర్ రెహ్మాన్ స్పష్టం చేయడం.. ఈ అంశంపై భారత్‌లో నెలకొన్న ఆందోళనలకు ప్రత్యక్ష సమాధానంగా మారింది.