Bandla Ganesh Sankalpa Yatra: నటుడు, ప్రముఖ సినీ నిర్మాతగా పేరొందిన బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా గత ప్రభుత్వం హయాంలో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అరెస్టైన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించి తాజాగా ఓ లేఖను విడుదల చేశారు. అందులో ఈనెల 19 (సోమవారం)న ఉదయం 9 గంటలకు షాద్నగర్లో ఉన్న తన నివాసం నుండి ‘సంకల్ప యాత్ర’ మొదలపెట్టబోతున్నట్లు బండ్ల గణేశ్ పేర్కొన్నారు.
ఇక ఆయన వెల్లడించిన లేఖలో.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధికి సంకల్ప యాత్ర అంటూ మొదలు పెట్టి.. మన నాయకుడు, దేశం గర్వించే దార్శనికుడు నారా చంద్రబాబునాయుడు మీద వేసిన అభాండాలు తొలిగిపోవాలని, ఆయన చెరసాల నుంచి బయటికి రావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గడప మీద నిలబడి మొక్కుకున్న మొక్కు “నా గడప నించి నీ కొండ దాకా పాదయాత్ర” చేసి వస్తా అని..
ఈ రోజు తెలుగు వారి ఇలవేల్పు ఏడుకొండలస్వామి ఆశ్శీస్సులతో, ప్రతి తెలుగు వాడి ప్రార్థనలతో మన బాబు మళ్లీ అఖండ విజయంతో పూర్వ వైభవాన్ని సాధించుకున్నారు. ఇటీవలే కేసులు అన్నీ కొట్టేశారు. నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తుతెచ్చుకుందని అన్నారు.
IND Vs NZ: నేడు న్యూజిలాండ్తో మూడో వన్డే.. నితీష్-ప్రసిధ్ అవుట్, భారత్ ప్లేయింగ్ XI ఇదే!
ఇంకా నా గడప నన్ను అడుగుతోంది మొక్కుబడి తీర్చుకోమని. శేషాచలం కొండ పిలుస్తోంది వచ్చి దర్శించుకోమని. అందుకే అమ్మ నాన్నల ఆశీర్వాదాలతో.. ఈ నెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు షాద్ నగర్ మా ఇంటి గడప ముందు కొబ్బరి కాయ కొట్టి పాదయాత్ర మొదలెట్టి ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకి చేరి ఏడుకొండలవాడి దర్శనం చేసుకోవడం సంకల్పం అన్నారు. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేదన తీర్చిన, నా కోరిక నెరవేర్చిన, నా మాట ఆలకించిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామికి నా మొక్కుబడి చెల్లింపు అని పేర్కొన్నారు.
