సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. రైతు రుణ మాఫీ , రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీ క్రింద ఇవ్వాలిసిన 27 వేల 500 కోట్ల రూపాయల నిధులను డిమాండ్ చేసిన బండి సంజయ్..ముఖ్యమంత్రి కెసిఆర్ వరి పంట వేయొద్దని ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరారు.
ప్రధాన మంత్రి ఫసల్ భీమా పధకం క్రింద రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా సొమ్ము 413. 50 కోట్ల రూపాయలను చెల్లించి రైతులను ఆదుకోవాలని లేఖ లో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మ హత్యలు అన్ని తెరాస ప్రభుత్వ హత్యలేనని.. రైతులకు ఉచితంగా ఎరువులు ఇచ్చి 2018 ఎన్నికలు సందర్భంగా తెరాస ఇచ్చిన హామీని నిలుపుకోవాలని పేర్కొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి , రైతులను దళారీలనుండి రక్షించాలన్నారు.
