Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకుంటామని హైకోర్టులో బండి భగీరథ్ లాయర్ మెమో ఫైల్ చేశారు. భగీరథ్ అరెస్ట్కు ముందు ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు తీర్పు ఇవాళ వెల్లడిస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల భగీరథ్ అరెస్ట్తో ముందస్తు బెయిల్ పిటిషన్పై ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఈ పిటిషన్ను ఉపసంహరించుకోనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బండి భగీరథ్పై పోక్సో కేసుతో పాటు అనేక సెక్షన్స్ యాడ్ చేశారు. తాజాగా మరో కొత్త సెక్షన్ జోడించినట్లు తెలిసింది. కీలక ఆధారాలు మాయం చేసినందుకుగాను తాజాగా 238 సెక్షన్ను అదనంగా జోడించారు పోలీసులు. భగీరథ్ డిజిటల్ ఆధారాలను తొలగించాడని, గతంలో వాడిన ఫోన్లు, సిమ్కార్డులు, ఇతర ముఖ్య ఆధారాలను నిందితుడు మాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని కొత్త సెక్షన్ యాడ్ చేశారు.
ఇక తన కుమారుడి అంశంపై నిన్న(బుధవారం) మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడారు. తనపై వస్తున్న ఆరోపణల అనంతరం తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఆయన మీడియాతో ప్రసంగించారు. “బీజేపీలో ప్రతిఒక్కరూ సుశిక్షితులైన కార్యకర్తలే ఉన్నారు. కమిట్మెంట్తో పనిచేసే పార్టీ కార్యకర్తను చివరి కోరిక ఏంటని అడిగితే.. చనిపోయిన తర్వాత బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటారు. నేను ఎలాంటి వాడినో కార్యకర్తలకు తెలుసు. నన్ను బర్తరఫ్ చేయాలని ఇతర పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ పార్టీకి లోక్సభలో ఒక్క ఎంపీ లేరు. ఫామ్హౌస్లో కూర్చుని ఏదైనా చెబుతారు. ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో కూల్చింది.. ఆ కుటుంబ పాలనను అంతం చేసింది మేమే. అందుకే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ ఫేక్ సోషల్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నారు. కన్నకొడుకును పోలీసులకు స్వయంగా అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా? విచారణకు సహకరించాలనే నా కుమారుడిని అప్పగించా.’’ అని బండి సంజయ్ అన్నారు.
