Ayodhya: అయోధ్య రామాలయ నిధుల వివాద వ్యవహారంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రక్రియను సాకుగా చూపిస్తూ, ఆలయానికి సంబంధించిన ఎలాంటి ఆర్థిక వివరాలను వెల్లడించడానికి ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ నిరాకరించింది. చివరికి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ద్వారా జిల్లా యంత్రాంగానికి అందిన లేఖకు సైతం సమాధానం ఇచ్చేందుకు ట్రస్ట్ నిరాకరించడం గమనార్హం.
అయోధ్యకు చెందిన స్థానిక బీజేపీ నాయకుడు డాక్టర్ రజనీష్ సింగ్.. రామాలయ ట్రస్ట్కు వస్తున్న విరాళాలు, బ్యాంకు ఖాతాలు, భూముల కొనుగోలు, అమ్మకాల్లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆలయ ట్రస్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలు, సమకూరిన ఆస్తుల వివరాలను బహిరంగపరచాలని డిమాండ్ చేస్తూ ఆయన జూన్ 9న మొదటిసారి, ఆ తర్వాత జూన్ 12న రెండోసారి పీఎంఓకు ఫిర్యాదులు పంపారు. ఆ మరుసటి రోజే, అంటే జూన్ 13న ఈ వ్యవహారంపై సిట్ (SIT) ఏర్పాటయింది. బీజేపీ నేత చేసిన ఈ ఫిర్యాదును ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా పరిగణించి, తదుపరి చర్యల కోసం అయోధ్య జిల్లా పరిపాలన విభాగానికి పంపింది. పీఎంఓ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం.. ఆలయ ఆదాయ-వ్యయాల లెక్కలు అప్పగించాలంటూ రామాలయ ట్రస్ట్ను కోరింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జూన్ 23న అయోధ్య ఏడీఎం (పరిపాలన) విశు రాజాకు రాసిన ఒక లేఖలో, ఏడీఎం (శాంతిభద్రతలు) ఇంద్రకాంత్ ద్వివేది ఈ విషయాలను ప్రస్తావించారు. పీఎంఓ పంపిన ఫిర్యాదు ఆధారంగా తాము రామాలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ను సంప్రదించి విరాళాల లెక్కలు అడిగామని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు సాగుతోందని, దర్యాప్తు ప్యానెల్ అన్ని కీలక రికార్డులను సేకరిస్తోందని చెబుతూ చంపత్ రాయ్ వివరాలు ఇవ్వడానికి నిరాకరించినట్లు ఏడీఎం తెలిపారు. విచారణ నడుస్తున్నందున ఇప్పుడు ఎలాంటి సమాచారం ఇవ్వలేమని ట్రస్ట్ స్పష్టం చేసింది.

