Ayodhya: “వాష్‌రూమ్‌లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు

Ram Mandir

Ram Mandir

Ayodhya: అయోధ్య రామ్ మందిర్ విరాళాల దొంగతనం కేసులో అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితులలో ఒకరైన అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెల్లడించాడు. దొంగిలించిన కోట్ల రూపాయల నగదును గుడి వెలుపలికి తరలించే ముందు తాత్కాలికంగా వాష్‌రూమ్‌లలో దాచేవాళ్లమని స్పష్టం చేశాడు. సీసీటీవీల నిఘా నుంచి ఎలా తప్పించుకున్నామో, విరాళాల లెక్కింపు వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటో అతను పూసగుచ్చినట్లు వివరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కోర్టు అనుమతితో మంగళవారం పోలీసులు అవినాష్ శుక్లాను దాదాపు రెండు గంటల పాటు విచారించగా, అతను కోట్ల రూపాయలు దొంగిలించినట్లు ఒప్పుకుంటూ నేరానికి సంబంధించిన పూర్తి క్రమాన్ని వివరించాడు.

ఈ విచారణలో నిందితుడు ఆలయ ట్రస్టీ అనిల్ మిశ్రా గురించి సైతం ప్రస్తావించాడు. విరాళాల లెక్కింపు ప్రక్రియలో అనిల్ మిశ్రా కీలక పాత్ర పోషించేవారని చెప్పాడు. కాగా, విరాళాల నిర్వహణ, పర్యవేక్షణ లోపాలపై తీవ్ర విమర్శలు రావడంతో అనిల్ మిశ్రా, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ గత వారమే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అవినాష్ శుక్లాతో పాటు చంపత్ రాయ్‌కు అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న రమాశంకర్ అలియాస్ టిన్ను యాదవ్, కౌంటింగ్ ఇన్‌చార్జ్ సుభాష్ శ్రీవాస్తవ, కౌంటింగ్ సిబ్బంది అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, రామ్ శంకర్ మిశ్రా, కరుణేష్ పాండేలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

కౌంటింగ్ రూమ్ యాక్సెస్..

విరాళాల లెక్కింపు గదికి సంబంధించిన రెండు కీలల్లో ఓ కీ టిన్ను యాదవ్ దగ్గర ఉండేదని, రెండో కీ బ్యాంకు ఉద్యోగుల వద్ద ఉండేదని అవినాష్ శుక్లా పోలీసులకు తెలిపాడు. అందరూ కలిసి ఓ పక్కా ప్లాన్ ప్రకారం ఈ దొంగతనానికి పాల్పడేవారమని, ఒకరు నగదును తీసుకుంటుంటే.. మిగిలిన వారు అతనికి ఎవరూ చూడకుండా కవరేజ్ (అడ్డుగా) ఇచ్చేవారని చెప్పాడు. ఆలయ కాంప్లెక్స్ లోపల సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నిందితులందరికీ ముందే బాగా తెలుసు. ఆ నాలెడ్జ్‌తోనే కెమెరాల నిఘా పడని ప్రదేశాలను వాడుకుంటూ, దొంగిలించిన డబ్బును మొదట బాత్‌రూమ్‌లలో దాచేవారు. ఆ తర్వాత వీలు చూసుకుని గుడి వెలుపలికి తరలించేవారు. పైగా వీరంతా ట్రస్ట్‌లోని పెద్దలతో సన్నిహితంగా ఉండటం వల్ల ఎవరికీ వీరిపై ఎలాంటి అనుమానం వచ్చేది కాదు. ఎవరూ వీరిని పెద్దగా పట్టించుకునేవారు కూడా కాదు.

నిఘా వ్యవస్థ కళ్లుగప్పి.. ఆస్తుల కొనుగోలు

ఆలయ కాంప్లెక్స్ లోపల ఉన్న కెమెరాల దృశ్యాలను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నప్పటికీ.. అక్కడి సిబ్బంది తమ కదలికలను అంత నిశితంగా గమనించలేకపోయారని శుక్లా చెప్పాడు. ఇలా దొంగిలించిన డబ్బుతో నిందితులు ఇళ్లు, స్థలాలు (భూములు) కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ప్రస్తుతం నిందితుల బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల వివరాలపై దృష్టి సారించారు. అసలు ఎలాంటి అనుమానం రాకుండా ఈ దొంగతనం ఇన్ని రోజుల పాటు ఎలా సాగింది? ఇందులో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

సిట్ (SIT) విచారణకు ముందే 58 లక్షల రికవరీ

ఈ భారీ విరాళాల దొంగతనంపై విచారణ జరిపేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అయితే, ఈ కేసులో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కావడానికి ముందే, జూన్ 5న ట్రస్ట్ ప్రతినిధులు అవినాష్ శుక్లా ఇంటి నుంచి రూ. 58 లక్షల నగదును రికవరీ చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అలాగే మిగిలిన సొమ్మును జూన్ 5 నుంచి 8 తేదీల మధ్య బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ల ద్వారా తిరిగి చెల్లించారు. దీన్ని బట్టి చూస్తే, ఈ వ్యవహారం అధికారికంగా చట్టపరమైన పరిధిలోకి లేదా పోలీసుల వద్దకు వెళ్లకముందే.. దొంగిలించబడిన సొమ్మును రికవరీ చేసే ప్రయత్నాలు అంతర్గతంగానే ప్రారంభమయ్యాయని స్పష్టమవుతోంది.