NTV Telugu Site icon

Paris: ఆస్ట్రేలియా మహిళపై గ్యాంగ్ రేప్.. ఒలింపిక్స్‌కి ముందు ఘటన..

Paris.

Paris.

Paris: 2024 ఒలింపిక్స్ కోసం పారిస్ సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో అట్టహాసంగా ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమానికి ముందు ఆస్ట్రేలియాకు చెందిన మహిళపై పారిస్‌లో గ్యాంగ్ రేప్ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఆమెపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. 25 ఏళ్ల మహిళ దిక్కుతోచని స్థితిలో శనివారం పారిస్‌లోని పిగాల్లే పరిసరాల్లోని ఓ స్థానిక రెస్టారెంట్‌లోకి ప్రవేశించింది. ఆమె దుస్తులు పాక్షికంగా చిరిగిపోయి ఉన్నాయి. శుక్రవారం-శనివారం ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు పారిస్ అధికారులు ధృవీకరించారు. ఆమె స్థితిని చూసిన రెస్టారెంట్ యాజమాన్యం సాయం చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం బిచాట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Read Also: Nitish Kumar: ‘‘ మీరు మహిళ, మీకు ఏం తెలియదు’’.. ఆర్జేడీ ఎమ్మెల్యేపై సీఎం ఫైర్..

భద్రతా అధికారులు పారిస్ ఒలింపిక్స్‌లో తీవ్రవాద దాడులు, సైబర్ అటాక్స్ వంటి వాటిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగులోకి రావడం ఇబ్బందికరంగా మారింది. ఆస్ట్రేలియా ఒలింపిక్ జట్టు పబ్లిక్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ చీఫ్ స్ట్రాత్ గోర్డాన్ మాట్లాడుతూ.. ఆస్ట్రేలియన్ అథ్లెట్లు ఈ దాడి గురించి తెలిపినట్లు వెల్లడించారు. పబ్లిక్ ప్లేసుల్లో ఉన్న సమయంలో టీమ్ కిట్ ధరించవద్దని వారికి సూచించారు.

బాధితురాలికి ఆస్త్రేలియన్ దౌత్య అధికారులు, ఫ్రెంచ్ పోలీసులు సాయం చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ అథ్లెట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నా మీరెస్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియన్ అథ్లెట్లకు భద్రతా ఉందని, వారు సురక్షితంగా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వారు ఒలింపిక్ విలేజ్ నుంచి సొంతగా బయటకు వెళ్లొద్దని, జట్టు యూనిఫాం ధరించొద్దని, సాధారణ దుస్తులు ధరించాల్సిందిగా వారిని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పారిస్‌లోని ఆస్ట్రేలియన్ రాయబార కార్యాలయం ప్రెంచ్ అధికారులతో అత్యవసర విచారణ చేస్తోంది. జూన్ నెలలో పారిస్ శివారులో 12 ఏళ్ల యూదు బాలికపై అత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది.