Australia Coach and Selector fielded in Namibia Match: టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరఫున ఆ జట్టు సహాయక సిబ్బంది ఫీల్డింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆస్ట్రేలియాకు ఆటగాళ్ల కొరత ఉండడంతో సిబ్బంది మైదానంలోకి దిగక తప్పలేదు. మంగళవారం ట్రినిడాడ్లోని క్వీన్స్ పార్క్ ఓవల్లో నబీమియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ, ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్, ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్, బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్ ఫీల్డింగ్ చేశారు.
నబీమియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు రెగ్యులర్ ఆటగాళ్లు అందుబాటులో లేరు. ఐపీఎల్ 2024 కారణంగా ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్ మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాలేకపోయారు. దాంతో మిచెల్ మార్ష్ నేతృత్వంలోని ఆసీస్ 9 మంది ఆటగాళ్లతో ఆడింది. అంతేకాకుండా మిచెల్ మార్ష్, జోష్ హాజిల్వుడ్ మధ్యలో విరామం తీసుకున్నారు. దాంతో ఆసీస్ సహాయక సిబ్బంది ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది.
ఆటగాళ్ల కొరత ఉన్నా నమీబియాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్లు జరుగుతుండగా.. జూన్ 2 నుంచి అసలు మ్యాచ్లు ఆరంభం కానున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు యూఎస్, విండీస్ చేరుకుంటున్నాయి.