Asia Cup 2025: ఒకే ఒక్క వికెట్.. చరిత్ర సృష్టించనున్న అర్ష్‌దీప్ సింగ్! తొలి భారత బౌలర్‌గా

  • సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్‌ 2025 ఆరంభం
  • మొదటి మ్యాచ్‌లో యూఏఈతో భారత్ మ్యాచ్‌
  • చరిత్ర సృష్టించనున్న అర్ష్‌దీప్ సింగ్
Arshdeep Singh 100 Wickets

Arshdeep Singh 100 Wickets

సెప్టెంబర్ 9 నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్‌ 2025 ఆరంభం కానుంది. టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌ హాంకాంగ్, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య జరగనుండగా.. భారత్ తన మొదటి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఆసియా కప్‌ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. ఆసియా కప్‌లో టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చరిత్ర సృష్టించేందుకు సిద్దమయ్యాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.

అర్ష్‌దీప్‌ సింగ్ ఇప్పటి వరకు 63 టీ20 మ్యాచుల్లో 99 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో అత్యధిక వికెట్స్ తీసిన తొలి భారత బౌలర్‌గా ఉన్నాడు. ఆసియా కప్‌ 2025లో అర్ష్‌దీప్‌ ఒక్క వికెట్ పడగొడితే వంద వికెట్ల క్లబ్‌లోకి చేరతాడు. దాంతో టీ20ల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. అలానే ఈ ఘనత సాధించిన 25వ బౌలర్‌గా నిలవనున్నాడు. టీ20 మ్యాచ్‌ల్లో 18.30 సగటు, 8.29 ఎకానమీ రేటుతో పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఉత్తమ గణాంకాలు 9 పరుగులకు 4 వికెట్లు. ప్రస్తుతం టోర్నమెంట్‌లో అర్ష్‌దీప్ సింగ్‌పై అందరి దృష్టి ఉంది.

Also Read: Hyderabad News: నారాయణగూడలో రూ.2 కోట్లు పట్టివేత.. ట్విస్ట్ ఏంటంటే?

2024 టీ20 ప్రపంచకప్ నుంచి అర్ష్‌దీప్‌ సింగ్ 11 మ్యాచ్‌లు ఆడి 15.15 సగటుతో 20 వికెట్లు పడగొట్టాడు. అంటే 14 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. 7.87 ఎకానమీని కొనసాగించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో అర్ష్‌దీప్ భారత టెస్ట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మొదటి మూడు టెస్ట్‌లకు ఎంపిక కాలేదు. మాంచెస్టర్‌లో జరిగిన నాల్గవ మ్యాచ్‌కు ముందు చేతికి గాయం కావడంతో టెస్ట్ అరంగేట్రం ఆలస్యం అయింది. ఇక భారత్ తరఫున టీ20 మ్యాచుల్లో అర్ష్‌దీప్‌ తర్వాత స్థానంలో యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్స్ తీశాడు. హార్దిక్ పాండ్య 114 మ్యాచ్‌ల్లో 94 వికెట్స్ పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 90, జస్ప్రీత్ బుమ్రా 89 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. పాండ్యకు కూడా వంద వికెట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది.