Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్‌’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!

  • 44 ఏళ్ల యాష్లే పాల్సన్‌ ట్రెడ్‌మిల్‌పై ప్రపంచ రికార్డు
  • కేవలం 12 గంటల 47 నిమిషాల 10 సెకన్లలో 100 మైళ్ల పరుగును పూర్తి
  • మహిళల విభాగంలో ట్రెడ్‌మిల్‌పై అత్యంత వేగంగా 100 మైళ్లు పూర్తి చేసిన రన్నర్‌గా రికార్డు..
Ashley Paulson Sets Guinness World Record

Ashley Paulson Sets Guinness World Record

Ashley Paulson Sets Guinness World Record: అమెరికాకు చెందిన ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌, అల్ట్రా మారథాన్‌ రన్నర్‌ యాష్లే పాల్సన్‌ (Ashley Paulson) అసాధారణ ప్రపంచ రికార్డు సృష్టించారు. ట్రెడ్‌మిల్‌పై ఏకంగా 100 మైళ్ల దూరాన్ని పరుగెత్తి మహిళల విభాగంలో అత్యంత వేగంగా ఈ దూరాన్ని పూర్తి చేసిన రన్నర్‌గా రికార్డు నెలకొల్పారు. 44 ఏళ్ల యాష్లే కేవలం 12 గంటల 47 నిమిషాల 10 సెకన్లలో 100 మైళ్ల పరుగును పూర్తి చేశారు.

మసాచుసెట్స్‌లోని బోస్టన్‌లో ఏప్రిల్‌ 18న జరిగిన ఈ రికార్డు ప్రయత్నంలో యాష్లే ఈ ఘనత సాధించారు. ఆమె సాధించిన సమయం గత రికార్డు కంటే ఏకంగా గంటన్నర వేగంగా ఉంది. బోస్టన్‌ మారథాన్‌ ఎక్స్‌పోలో జరిగిన ఈ ప్రయత్నానికి ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రోత్సహించారు.

ట్రెడ్‌మిల్‌పై 100 మైళ్లు పరుగెత్తడం అంత సులభం కాదని యాష్లే తెలిపారు. తన శిక్షణలో ట్రెడ్‌మిల్‌ ఎప్పటి నుంచో ఒక భాగమని, సరదాగా దాన్ని ‘డ్రెడ్‌మిల్‌’ అని పిలుస్తానని చెప్పారు. ప్రపంచ రికార్డు సాధించాలనే లక్ష్యంతో ఆమె ట్రెడ్‌మిల్‌పై లెక్కలేనన్ని మైళ్లు పరుగెత్తి కఠినంగా శిక్షణ పొందారు. ఇప్పటికే యాష్లే పేరిట మరో రికార్డు కూడా ఉంది. 2023లో మహిళల విభాగంలో అత్యంత వేగంగా బాడ్‌వాటర్‌ 135 అల్ట్రామారథాన్‌ను పూర్తి చేసిన రికార్డును ఆమె సాధించారు. 135 మైళ్ల దూరం ఉండే ఈ రేస్‌ను ప్రపంచంలోని అత్యంత కఠినమైన రేసుల్లో ఒకటిగా పరిగణిస్తారు.

బాడ్‌వాటర్‌ 135 రేస్‌ డెత్‌ వ్యాలీలో సముద్ర మట్టానికి 282 అడుగుల దిగువ నుంచి ప్రారంభమై 8,360 అడుగుల ఎత్తులోని విట్నీ పోర్టల్‌ వరకు సాగుతుంది. ఈ సమయంలో రన్నర్లు 54 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉండే తీవ్రమైన ఎడారి వేడిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి కఠినమైన రేసును పూర్తి చేసిన అనుభవం యాష్లేకు ట్రెడ్‌మిల్‌పై 100 మైళ్ల పరుగుకు ఎంతో ఉపయోగపడింది.

ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడంలో అతిపెద్ద సవాళ్లలో ఒకటి భూభాగంలో మార్పులు లేకపోవడమేనని యాష్లే అన్నారు. రోడ్డుపై లేదా ట్రయిల్‌లో పరుగెత్తేటప్పుడు ఎడమ, కుడి వైపు మలుపులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. కానీ ట్రెడ్‌మిల్‌పై ఒకే రకమైన కదలిక నిరంతరం కొనసాగుతుంది. దీంతో కొన్ని కండరాలపై ఒకే విధమైన ఒత్తిడి పడుతూ తీవ్రమైన అలసటకు గురయ్యానని ఆమె చెప్పారు. మరోవైపు ఎక్స్‌పోలో వేలాది మంది తనను చూస్తుండటం కూడా మానసికంగా సవాలుగా మారిందని తెలిపారు. సాధారణ అల్ట్రామారథాన్‌లలో ఒంటరిగా పరుగెత్తే సమయంలో కష్టమైన క్షణాలను తనలో తాను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, కానీ ఇక్కడ తన ప్రతి కదలికను వేలాది మంది గమనిస్తుండటంతో మరింత ఒత్తిడి అనిపించిందని చెప్పారు.

రికార్డు నిబంధనల ప్రకారం యాష్లే ఎన్ని విరామాలు తీసుకున్నా సమయం మాత్రం ఆగదు. ఆమె అవసరమైన సమయంలో కొన్ని స్వల్ప విరామాలు తీసుకున్నారు. ముఖ్యంగా బాత్రూమ్‌ బ్రేక్‌లు తీసుకున్నప్పటికీ వీలైనంత వరకు పరుగును కొనసాగించారు. ఒకసారి వరుసగా మూడు గంటల పాటు ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తడం ఆమె అత్యంత సుదీర్ఘమైన నిరంతర పరుగుగా నమోదయింది. రికార్డు ప్రయత్నం సమయంలో ఆమె అభిమానులు పింక్‌ విగ్‌లు ధరించి వచ్చి ఉత్సాహపరిచారు. యాష్లే సిగ్నేచర్‌ నియాన్‌ హెయిర్‌కు గుర్తుగా వారు ఇలా చేయడం ఆమెను మరింత ఉత్సాహపరిచింది.

యాష్లేకు సోషల్‌ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకు భర్త మాట్‌తో కలిసి నలుగురు పిల్లలు, ఒక మనవడు ఉన్నారు. రికార్డు బద్దలు కొట్టిన సమయంలో తన కుమారుడు ఐప్యాడ్‌ను పట్టుకుని, ఫేస్‌టైమ్‌ ద్వారా ఇతర పిల్లలు తనను చూస్తున్న దృశ్యం తనకు అత్యంత ఇష్టమైన క్షణాల్లో ఒకటని యాష్లే తెలిపారు. ఇప్పటివరకు ఆమె 140కి పైగా మారథాన్‌లు, 25కు పైగా ఐరన్‌మ్యాన్‌ ట్రయాథ్లాన్‌లు, అనేక అల్ట్రామారథాన్‌లు పూర్తి చేశారు. 200 మైళ్లకు పైగా దూరం ఉన్న పలు రేసుల్లోనూ పాల్గొన్నారు. ఈ ప్రపంచ రికార్డు తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పిన యాష్లే.. తన పిల్లలు, మనవడికి పెద్ద కలలు కనడం, నిరంతరం కష్టపడితే వాటిని సాధించవచ్చని చూపించడమే తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. “కష్టపడి పనిచేయండి.. స్థిరంగా కొనసాగండి.. ఇంకా పెద్ద కలలు కనండి” అని యాష్లే తన సందేశం ఇచ్చింది.